11/09/2024
ప్రతీ పౌరుడికి ఓటు అనేది హక్కు
- ఓటు వేయడం బాధ్యత
- సిరికొండ విక్రమ్ కుమార్, MVO -ఫౌండర్
ప్రతు పౌరుడికి ఓటు అనేది హక్కు అని, ఓటు వేయడం బాధ్యత కూడా అని మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరికొండ విక్రమ్ కుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే ఓటర్లను ప్రలోభ పెట్టి తననే సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానం చేసుకున్నది సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయంపై బుధవారం మేయిల్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కలెక్టర్, పోలీస్ అధికారులకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకోమ్ము తండా గ్రామంలో గత రెండు రోజుల క్రితం రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా తననే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అందుకుగాను గ్రామంలో మూడు గుడులు, ఓటుకో వెయ్యి రూపాయలు ఇస్తానని ఓటర్లను ప్రలోభ పెట్టి తీర్మానం చేసుకున్నది మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినప్పుడే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందన్నారు. అడ్డదారిలో ప్రలోభాలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ధనార్జన లక్ష్యంగా పనిచేస్తారని, భవిష్యత్ తరాల కోసం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకొని సర్పంచ్లను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.