15/02/2026
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదు
- మేడారం కోవా బన్ ఉదంతంలో యావత్ హిందూ సమాజం వలీకి అండగా నిలవడం హర్షణీయం
- మత సామరస్యం వెల్లివిరిసేలా కూటమి పాలన
- కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారమందించాలి
- ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి
- మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోవ బన్ను పరిశ్రమ కొరకు వలి & మిత్ర బృందానికి షిబ్లీ గారి చేతుల మీదుగా రూ. 50 వేలు సహాయం
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు స్థానం లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి తెలిపారు. ఇటీవల మేడారం జాతర సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులచే వేధింపులకు గురైన కోవా బన్ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం నిజంగా హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన వలీ, జావేద్, హుస్సేన్ తదితరులు ఆదివారం నగరంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయానికి విచ్చేశారు. వలీకి అండగా ఉంటామని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం లభించేలా కృషి చేస్తామని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి ఈ సందర్భంగా వలీ తదితరులకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వ భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వలీకి ఎదురైన అవమానం పట్ల విచారం వ్యక్తం చేసి, సంఘీభావం తెలియజేశారని షుబ్లి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత కొణిదెల నాగబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితర ముఖ్య నేతలు మేడారం ఉదంతం పట్ల విచారం వ్యక్తం చేసి, వలీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మత సామరస్యంతో విలసిల్లుతోందని, అన్ని వర్గాల ప్రజలు శాంతి, సౌహార్ద వాతావరణంలో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఫారూఖ్ షుబ్లి వెల్లాడించారు. కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోవ బన్ను పరిశ్రమకు వలీ & అతని మిత్ర బృందానికి షిబ్లీ గారి చేతుల మీదుగా రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.