26/02/2025
పిడిఎఫ్ vs కూటమి అభ్యర్థులు : పోటాపోటీగా ఎమ్మెల్సీ ఎన్నికలు..
ఎపిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అందరూ భావిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, తన అధికారాన్నంతటినీ వినియోగించినా టిడిపి అభ్యర్థులు విజయం సాధించడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అధికారం, డబ్బు ప్రయోగించినా పిడిఎఫ్ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు.
కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్, పిడిఎఫ్ అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణరావు బలమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారి తరపున యువత పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఆయనపై టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇదేవిధంగా గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థి పి.రాజశేఖర్పై పిడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు తలపడుతున్నారు. అయితే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితి విభిన్నంగా ఉంది.
ఈ ప్రాంతంలో త్రిముఖ పోరు నెలకొంది. పిడిఎఫ్, పిఆర్టియు, ఎపిటిఎఫ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. కూటమి ఎపిటిఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు నివ్వగా, పిడిఎఫ్ అభ్యర్థిగా విజయగౌరీ పోటీపడుతున్నారు. అయితే రఘువర్మ, విజయగౌరీల మధ్య బలమైన పోటీ నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నా, కూటమి బలపరిచినప్పటికీ పాలక అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.
1.పిడిఎఫ్ బలం : గ్రాడ్యుయేట్ ఓటర్లు పిడిఎఫ్ అభ్యర్థులు ప్రజలకోసం పనిచేస్తారని గ్రాడ్యుయేట్ ఓటర్లు బలంగా విశ్వసిస్తుండటం, వారిపై ఆరోపణలు లేకపోవడం. ఇతర పార్టీలతో పోలిస్తే.. వామపక్షాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో మంచి రికార్డు ఉంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లు అభ్యర్థులకు ఉన్న ఇమేజ్ను విశ్వసిస్తారు తప్పితే.. అధికారం, డబ్బు బలానికి ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువ. టిడిపి బలపరిచిన అభ్యర్థుల ప్రచారాన్ని గమనిస్తే.. రౌడీ షీటర్స్,. అవినీతి పరులు, ధనవంతులు. ఓటర్లు వారిని విశ్వసించే అవకాశం లేదు.
2.కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలే అయినప్పటికీ.. ఇసుక, మట్టి, లిక్కర్ వ్యాపారాలు, అవినీతి బాగోతాలతో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అయిష్టత, వ్యతిరేకత నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ వైఫల్యం, లాబీయింగ్లతో కూటమి ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంది.
3.జనసేన, టిడిపిల మధ్య పెరిగిన గ్యాప్
జనసే, టిడిపిల మధ్య పెరిగిన అనిశ్చితి కీలకంగా మారనుంది. కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు టిడిపి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అయిష్టత కనబరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయడం చూశాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. టిడిపిఎమ్మెల్యేలు, నేతలు తమ పట్ల వివక్ష చూపుతున్నారని జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు తమను మోసం చేశారని భావిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టిడిపి అభ్యర్థులకు మద్దతు ప్రకటించేందుకు అయిష్టత చూపుతున్నారు.
4. పిడిఎఫ్కి వైఎస్ఆర్ పార్టీ మద్దతు
వైఎస్ఆర్ పార్టీ ఓటింగ్ కూడా కీలకంగా మారనుంది. ప్రస్తుతం పార్టీ బలహీనంగా మారినప్పటికీ, అభ్యర్థులు పోటీలో లేకపోయినప్పటికీ వారి ఓటింగ్ వారికే ఉంది. వైఎస్ఆర్ పార్టీ పరోక్షంగా పిడిఎఫ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పిడిఎఫ్ అభ్యర్థులకు ప్రత్యక్షంగా పనిచేస్తోంది.
ఈ కారణాలు పిడిఎఫ్ అభ్యర్థులపై కూటమి అభ్యర్థులు గెలుపును కష్టతరం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులు కేవలం అధికారం, డబ్బులనే అవకాశంగా వినియోగించేందకు సిద్ధమయ్యారని అన్నారు. ఈ రెండింటికీ ఓటర్లు ప్రభావితం కాకపోతే.. కూటమి అభ్యర్థుల గెలుపు దాదాపు అసాధ్యమేనని స్పష్టం చేస్తున్నారు.