15/08/2026
"దేశభక్తి చాటుదాం" గుంటూరు జిల్లా కుంచనపల్లి మరియు తాడేపల్లి సుందరయ్య నగర్ లో జరిగింది.
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు.
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు, ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ పిలుపుమేరకు ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి ఎంపీయుపి పాఠశాల నందు శుక్రవారం ప్రజానాట్యమండలి తాడేపల్లి రూరల్ కమిటీ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుదాం పేరుతో విద్యార్థిని విద్యార్థులకు పాటల పోటీలను నిర్వహించారు. ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు నల్లపు కిషోర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆర్ వి రాఘవయ్య, రైతు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. మూడవ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు పలు దేశభక్తి గీతాలను ఉత్సాహభరితంగా ఆలపించి, తమ ప్రతిభను చాటారు. అనంతరం సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రజానాట్యమండలి మేమంటోలు, సర్టిఫికెట్లను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్ వి రాఘవయ్య మాట్లాడుతూ సమాజంలో డిజిటల్ వినియోగం విపరీతంగా పెరిగిందన్నారు. విద్యార్థులు విలువలతో కూడిన చదువుతోపాటు, కళల పట్ల ఆసక్తితో తమ తమ ప్రతిభలను కనబరుచుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు సంఘం గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులలో దాగిన వివిధ రకాల కళలను ప్రోత్సహించే దిశగా ప్రజానాట్యమండలి కృషి చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు తమ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కృషిచేసి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. సిఐటియు తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు విద్యార్థులు మంచి నడవడికను అలవర్చుకొని, గురువులు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు కంచర్ల సాంబశివరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ నాగేశ్వరరావు, సుధా రత్న కుమారి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.