PASS Manovikas Tirupati

PASS Manovikas Tirupati Service to the orphans with MENTALLY CHALLENGED

*ప్రశాంతినిలయ అనుభూతి నింపిన నిడదవోలు*కలియుగంలో ముక్తి సాధనకు ఏకైక మార్గం నామసంకీర్తన. అటువంటి నామ సంకీర్తనను సుమారు గంట...
29/10/2024

*ప్రశాంతినిలయ అనుభూతి నింపిన నిడదవోలు*
కలియుగంలో ముక్తి సాధనకు ఏకైక మార్గం నామసంకీర్తన. అటువంటి నామ సంకీర్తనను సుమారు గంటన్నరకు పైగా అందించి, భక్తి భావ తరంగాలను అ ప్రాంగణమంతా నింపి, ప్రశాంతి నిలయంలో ఉన్నామా అన్న అనుభూతిని కలిగించారు *శ్రీ నిడదవోలు సత్యనారాయణ మూర్తి* (సత్తిబాబు)గారు. జన్మతః వచ్చిన సంగీతాన్ని కఠోర సాధన ద్వారా మెరుగులు దిద్దుకుని ఎంతో విద్వత్తును ఇనుమడింపజేసుకున్న శ్రీ సత్తిబాబు గారు ప్రదర్శనలకు వ్యతిరేకులు. బయట ఏ వేదికలపై పాడరు. దైవదత్తమైన తన గానం భాగ్యవంతునికే చెందాలనేది వారి నమ్మకం. కేవలం సత్యసాయి భజన మందిరంలోనే పాడతారు. అందుకే ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ, రాజ్యమహేంద్రవరంలోనే వీరి గురించి చాలా మందికి తెలియదు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ... సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 17వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 8 గంటలవరకూ నామ సంకీర్తన చేయడానికి అతి కష్టం మీద శ్రీ సత్తిబాబుగారు ఒప్పుకున్నారు. హైదరాబాదుకి చెందిన శ్రీ శివ శ్రీకాంత్ గారు వీరికి సహకార గానం అందించారు. హిందుస్తానీ బాణీలో అద్భుతంగా సాగిన ఈ కార్యక్రమాన్ని సత్యసాయి భజన “చిత్త చోర యశోద కే బాల్”తో ప్రారంభించారు. కీబోర్డుపై తిరుపతి శ్రీ బికే. భరద్వాజ గారు ఎంతో అనునయంగా సహకరించారు. తిరుపతి శ్రీ జి. నటరాజ గారు పైకాల నడకలను చాలా సమతూకంగా తబలాపై వాయించి, రక్తికట్టించారు. అదే విధంగా రిథం పాడ్స్ పై తిరుపతి శ్రీ పి. జయచంద్ర గారు సమయానుకూలంగా స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ తో ఆకట్టుకున్నారు.
ఆ తరువాత కళ్యాణి రాగంలో పాండురంగ విఠలే హరినారాయణ భజనావళి గీతాన్ని త్రిస్తాయిల్లో పాడి, శ్రీ సత్తిబాబు గారు ప్రతిభను చాటుకున్నారు.
ఇదేవిధంగా, వాసంతి, జోగ్, మిశ్ర శివరంజని, చక్రవాకం, మోహన, హంసానంది వంటి రాగాల్లో హిందుస్తానీ సంకీర్తనలు ఎంతో భక్తి భావ యుక్తంగా ఆలపించి ఈ సాయంత్రాన్ని శుభ సాయంత్రం చేశారు శ్రీ నిడదవోలు సత్యనారాయణ మూర్తి గారు. శ్రీ భరద్వాజగారు ఎంతో అనుభూతి చెందుతూ, అత్యుత్తమ స్థాయిలో సహకరించారు. వనమాలి రాధా రమణా గిరిధారి గోవిందా కీర్తనలో ఎంతో అద్భుతంగా హార్మోనియం ధ్వనితో సహకరించారు. శ్రీ జి. నటరాజ గారు కూడా తబలాపై అత్యంత ప్రతిభావంతంగా సహకరించారు. ముఖ్యంగా, నామ సంకీర్తనకు తబలా వాయించడం కొంచెం కష్టం. ఒక్కొక్కసారి విపరీత పైకాలాలు వాయించవలసి వస్తుంది. సాధన లేకపోతే, అడ్డంగా దొరికిపోతారు. కానీ, శ్రీ నటరాజ గారు ‘ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా’ దుమ్ముదులిపేశారు. గోవింద కృష్ణ జై పాటకు రెట్టించిన ఉత్సాహంతో వాయించి అబ్బురపచారు. అంతే ధీటుగా శ్రీ పి. జయచంద్ర గారు కూడా, తబలాను అనుసరించారు.
శ్రీ సత్తిబాబు గారు ప్రతిభ చూసి శ్రోతలు ఎంతో ఆశ్చర్య చకితులయ్యారు. ఇంతటి ప్రజ్ఞ ఉన్న వీరు “మట్టిలో మాణిక్యంలా ఉండిపోయారే” అని చాలామంది అనుకున్నారు. ఇంతటి మహోన్నత నామసంకీర్తనా కళాకారుణ్ణి పరచయం చేసినందుకు నిర్వాహకులను ఎందరో అభినందించారు.
ఈ అపురూపమైన భజన సుధా వాహినిని మీరూ ఆస్వాదించండి. మరి కొంతమందికి చేరవేయండి. ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేయగలిగేలా మాలాంటి వారికి ఉత్తేజాన్ని కలిగించండి.
ఈ క్రింది లింకు నొక్కండి. వీలైనంత మందికి పంపించండి.

On17.06.2024 , Sri Nidadavolu Satyanarayana Rajahmundry- Satya Sai Bhajans -Satya Sai Bhajans went brilliantly in the Saptagiri Music Week held in Tirupati V...

*ఆనందనందనం కేవీ బ్రహ్మానందం గాన చందనం*ఆ గొంతులో ఏదో తెలియని కనికట్టు!! సప్త స్వరాలపై మంచి పట్టు!! సుమారు 70 సంవత్సరాల అన...
28/10/2024

*ఆనందనందనం కేవీ బ్రహ్మానందం గాన చందనం*
ఆ గొంతులో ఏదో తెలియని కనికట్టు!! సప్త స్వరాలపై మంచి పట్టు!!
సుమారు 70 సంవత్సరాల అనుభవం రంగరించిన గాత్ర సౌరభంతో పరిణతి చెందిన సంగీత విద్వత్తుతో విజయవాడ శ్రీ కే.వి. బ్రహ్మానందం గారు సుమారు ఒక గంట పాటు అపురూప వాగ్గేయకార కీర్తనలు ఆలపించి సభికులను రంజింపజేశారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 20వ తేదీన ఉదయం 11 గంటల నుండి 12గంటలవరకూ ఎంతో భక్తిగా గానం చేశారు. వీరికి విశాఖపట్నం శ్రీ హెచ్. రామచరణ్ గారు వయొలిన్ తో, విశాఖపట్నం శ్రీ పురాణం రవీంద్రుడు గారు మృదంగంతో అద్భుతంగా సహకరించి కచేరీని తమదైన శైలిలో సుసంపన్నం చేశారు.
కళ్యాణి రాగంలో “ననుబ్రోవమని చెప్పవే” అంటూ మిశ్రచాపు తాళంలో రామదాసు కీర్తనతో శ్రీ బ్రహ్మానందం గారు కచేరీ ప్రారంభిచారు. ఈ కీర్తనలో వారి అనుభవం ద్యోతకమైంది. అంతే అనుభవంతోనూ, “ఏది వాయించ కూడదో తెలిస్తే, ఏది వాయించాలో అదే తెలుస్తుంది” అని వారి గురువుగారు మృదంగ విద్వన్మణి శ్రీ వి. కమలాకరరావు గారి మాటలను తన వాయిద్యంలో చూపించారు శ్రీ రవీంద్రుడు గారు. గురుసమానులైన వారికి ఎంతో వినయంతో, వారికి తోడ్పాటునిస్తూ వయొలిన్ పై సహకరించారు శ్రీ రామాచారణ్ గారు.
ఆ తరువాత పంతువరాళి రాగంలో ఆన్ని కోణాలూ స్పృశిస్తూ, శిష్యులు, వర్ధామాన గాయకులు నేర్చుకునేటట్లుగా సవిస్తరంగా రాగాలాపన చేసి, “ఎన్నగాను రామ భజన” కీర్తనను రూపకతాళంలో ఎంతో మనోరంజకంగా పాడి, “రామ చిలుక నొకటి బెంచీ” అంటూ వివిధ స్థాయిల్లో నెరవులో పదును చూపించి, స్వరకల్పనలో తన గురువు గారు గాయక సామ్రాట్ స్వర్గీయ ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని గుర్తుచేశారు. శ్రీ రామచరణ్ గారు ఎంతో ప్రతిభతో సహకరిస్తూ, స్వరకల్పనలో అద్భుత మనోధర్మాన్ని ప్రదర్శించారు. శ్రీ రవీంద్రుడు గారి తన్యాయవర్తనం వారి స్తాయికి తగ్గట్టుగా నిండుదనాన్నిచ్చింది. రెండవ కీర్తనే ప్రధానాంశం అని ఎవరూ ఊహించలేదు. ఇలా, ఎవరూ ఊహించనివి ఈ 7 రోజుల్లో చాలా జరిగాయి.
ఆ వెంటనే, కాపీ రాగంలో “శ్రీ రామ నామము.. ఎంత ఎంతో మధురమూ” తిశ్ర గతిలో భావయుక్తంగా వినిపించారు. తిలంగ్ రాగాన్ని అలా స్పృశించి, శివరామ కృష్ణ గోవింద నరహరి అంటూ పాడుతుంటే, సభలో అందరూ తన్మయత్వం చందారు. ముఖ్యంగా వారి శిష్యులు, ప్రశిష్యులు కర్ణాటక నుండి, వరంగల్ నుండి వారి గాత్రాన్ని వినడానికి వచ్చారు. తిరుపతిలో కూడా వారికి ఎంతోమంది శిష్యులున్నారు. వారందరూ ఈ కచేరీ వింటూ ఎంతో ఆనందించారు. శ్రీ బ్రహ్మానందం గారికి ప్రపంచ వ్యాప్తంగా శిష్యులున్నారు. వారిలో కొంత మందిని ఈ సభకు పరిచయం చేశారు కూడా.
ఈ సప్తగిరి సంగీత సప్తాహంలో వీరు ఎనలేని సేవలందించారు. జూన్ 16న ప్రారంభోత్సవం నుండి, జూన్ 23న సమాపనోత్సవం వరకూ వీరు నిర్వాహకులకు వెన్ను దన్నుగా ఉండి, అండదండలు అందించారు. లక్ష రూపాయలు విరాళంగా కూడా అందించిన మహా దాత వీరు.
మళ్ళీ మనం కచేరీలోకి వచ్చేద్దాం.
తిలంగ్ తో మొదలుపెట్టి, రాగమలికగా అందరి దేవుళ్ళనూ వారు స్మరించారు. చివరగా కైవారం యోగినారాయణ గారి తత్వంతో కచేరీని ముగించారు.
ముఖ్యంగా ఇప్పటితరం వారు ఈ కచేరీని తప్పనిసగా వినాలి. స్తిమితంగా పాడటం ఎలాగో ఈ కచేరీ చూస్తూ వింటే, తెలుస్తుంది.
ఈ సంగీత కచేరీని మీరూ వినండి. మీ ఆప్తులనూ వినేటట్లు చేయండి. తద్వారా సంగీతాన్ని ప్రోత్సహించండి. మాలాంటి వారికి ఉత్తేజాన్ని కలిగించండి.
ఈ క్రింది లింకు నొక్కండి. వీలైనంత మందికి పంపించండి.

On20.06.2024, Apuroopa Vaageeyakaara Vaibhavam - Mr. K.V. BRAHMANANDAM - VOCAL Concert went brilliantly in the Saptagiri Sangeetha Saptaham held in Tirup...

*వీనుల విందు చేసిన విజయలక్ష్మి గానం *ప్రముఖ వర్ధమాన గాయని హైదరాబాద్ శ్రీమతి సిహెచ్. కృష్ణవేణి గారి గాత్ర కచేరీ ఆహూతులను ...
27/10/2024

*వీనుల విందు చేసిన విజయలక్ష్మి గానం *
ప్రముఖ వర్ధమాన గాయని హైదరాబాద్ శ్రీమతి సిహెచ్. కృష్ణవేణి గారి గాత్ర కచేరీ ఆహూతులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది. ఈమె ఇక్కడి శ్రోతలకు పరిచయం లేకపోవడం వల్ల, అంతగా పేరు విని ఉండకపోవడం వల్ల చూడటానికి చిన్న పిల్లలా ఉండటం వల్ల ఏం పాడుతారా అని ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, మొదటి కీర్తనలోనే తానేమిటో నిరూపించుకున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు.
ఇటీవలే స్వర్గస్తులైన సంగీత మహోపాధ్యాయ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జున శర్మగారు, శ్రీమతి లావణ్య లత గారు, శ్రీమతి జ్ఞానాంబాళ్, శ్రీ మల్లాది నారాయణ శశర్మ గారు వంటి ఉద్ధండుల శిష్యరికంలో, సంగీతంలో మంచి పట్టు సంపాదించారు. ఆకాశవాణిలో ఏ గ్రేడు కళాకారిణిగా ఎంపికయ్యారు. దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసి ఎన్నో అవార్డులు అందుకున్నారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 20వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5 గంటలవరకూ తన మాధుర్యమైన, సుస్వర గాత్రంతో భద్రాచల రామదాసులవారి కీర్తనలను గానం చేసి, సభికులను రంజింపజేశారు. ఈ కచేరీకి తిరుపతి శ్రీ టి. గిరినాథ్ రెడ్డిగారు వయొలిన్ తో, కర్నూల్ శ్రీ బయలుపాటి కే. సుధాకర్ గారు మృదంగంతో, తిరుపతి శ్రీ ఎల్. ప్రసాద్ గారు ఘటంతో అద్భుతంగా సహకరించి కచేరీని రక్తికట్టించారు.
భద్రాచల రామదాసులవారి దాశరధీ శతకం లోని “రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామా” పద్యాన్ని కానడ రాగంలో సద్భక్తికంగా గానంచేస్తూ, కచేరీని ఆరంభించారు.
హరిహరి రామ నన్నరమరచేయకు అనే కీర్తననను సలలితంగా, సున్నితంగా పాడి, ఎక్కడో వెనుక వారుసల్లో కూర్చున్న శ్రోతలను ముందుకు రప్పించేశారు. సహ విద్వాంసులు శ్రీ గిరినాథ రెడ్డిగారు, శ్రీ సుధాకర్ గారు, శ్రీ ఎల్ ప్రసాద్ గారు ఎంతో సున్నితంగా, కీర్తన భావం ఏమాత్రం చెడకుండా సహకరించారు.
ప్రతీ సంగీత కళాకారునికీ ముఖ్యంగా ఉండవలసిన మైకు పట్ల అవగాహన ఈమెకు పుష్కలంగా ఉంది. పాడేవారికీ, సహకార వాయిద్యాలకు మైకు ద్వని ఎంత స్థాయిలో ఉంటే వినసొంపుగా ఉంటుందో శ్రీమతి విజయలక్ష్మి గారికి బాగా తెలుసు.
ఆతరువాత “రా రా నా వెన్నముద్ద గోపాలా” అంటూ ఖమాస్ రాగంలో పాడి, శ్రీ కృష్ణునిపై భక్త రామదాసు గారు రాసిన అపురూప కీర్తన వినిపించారు. ఈ కీర్తన త్రిశ్ర గతిలో ఎంత ముద్దుగా పాడారో మాటల్లో చెప్పలేము.
ఇక్కడ ఒక విశేషం జరిగినది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఈ కీర్తనకు మృదంగ సహకారం అందించాడు (నేనే). విని ఎలా ఉందో, మీరే మీ కామెంట్ల ద్వారా చెప్పాలి. ఘటం శ్రీ ఎల్. ప్రసాద్ గారు సమయస్పూర్తిగా మృదంగానికి అనుకూలంగా కక్కగా వాయించారు. శ్రీ గిరినాథ్ రెడ్డిగారో ..!! మరి చెప్పనవసరం లేదు.
ఆ తరువాత వకుళాభరణ రాగంలో పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు స్వరపరచిన “భజరే శ్రీరామం హే మానస” మిశ్రచాపు తాళంలో అద్భుతంగా గానంచేసి “సెహబాస్” అనిపించుకున్నారు.
ప్రధానాంశంగా, పూర్వీ కళ్యాణి రాగంలో విస్తార రాగాలాపన చేసి, “ఓ రామ నీ నామ మెంతో రుచిరా” కీర్తనను ఆదితాళంలో సమర్పించారు. ఈ అంశంలో తన మనోధర్మాన్నీ, స్వరంపై పట్టును చాటుకున్నారు. శ్రీ గిరినాథ రెడ్డిగారు కూడా అదే స్తాయిలో కమానుతో తన ప్రజ్ఞను ప్రదర్శించారు. మృదంగం, ఘటం ఒక ఐదు నిముషాలయినా వాయిస్తే బాగుండేది. ఎందుకో సింపుల్ గా కానిచ్చేశారు.
కర్ణాటక సంగీతంలో మాస్టర్ డిగ్రీ అందుకున్న శ్రీమతి విజయలక్ష్మి గారు కచేరీలో తరువాతి అంశంగా, ఏదయ్యా నామీద” అంటూ కాపీ రాగంలో తిశ్రగతిలో ఒకరకమైన చమత్కారంగా పాడారు. వెంటనే, యమునా కళ్యాణి రాగంలో “పాహిపాహిమాం కృష్ణ పరమ దాయాలో” ఆదితాళంలో ఆలపించారు శ్రీమతి విజయలక్ష్మి గారు. చివరిగా, సంగీత కళానిధి డా. నేదునూరి కృష్ణమూర్తి గారు ఝంఝూటి రాగంలో స్వరపరచిన “రామ సీతారామ రఘురామా” అనే కీర్తనతో కచేరీని పరిసమాప్తం చేశారు.
ఇంత మనోహరమైన, హృదయ రంజకమైన ఈ సంగీత కచేరీని మీరూ వినండి. మీ ఆప్తులనూ వినేటట్లు చేయండి. తద్వారా సంగీతాన్ని ప్రోత్సహించండి. ఇలాంటి వర్ధామాన కళాకారులకు ఉత్తేజాన్ని ఇవ్వండి.
ఈ క్రింది లింకు నొక్కండి. వీలైనంత మందికి పంపించండి.

On 20.06.2024, Apuroopa Vaageeyakaara Vaibhavam - Mrs.Ch. KRISHNAVENI garu, Hyderabad - Vocal Concert went brilliantly in the Saptagiri Sangeetha Saptaha...

*భావ గర్భితం, సుస్వర శోభితం శారద గాత్రం*అత్యంత భక్తితో, అంతే ఆర్తితో, విశేష ప్రతిభతో శ్రీ భద్రాచల రామదాస కీర్తనలను గానం ...
27/10/2024

*భావ గర్భితం, సుస్వర శోభితం శారద గాత్రం*

అత్యంత భక్తితో, అంతే ఆర్తితో, విశేష ప్రతిభతో శ్రీ భద్రాచల రామదాస కీర్తనలను గానం చేస్తూ, శ్రోతలను ఆకట్టుకున్నారు విశాఖపట్నం డా. జి. శారద సుబ్రమణ్యం గారు. మహోన్నత సంగీత కుటుంబంలో జన్మించి, ఇంద్రగంటి శారాదగా చిన్నప్పటినుండే ప్రసిద్దురాలయ్యారు. ప్రస్తుతం డా. జి. శారాదా సుబ్రమణ్యం గా సుప్రసిద్దురాలై, దేశ విదేశాల్లో ప్రతిష్టాత్మక సభల్లో తన కళను ప్రదర్శించి, ప్రశంసలు అందుకుంటున్నారు. ఈమె చిన్న వయస్సులోనే కళాతపస్వి స్వర్గీయ కే. విశ్వనాథ్ గారి దృష్టిని ఆకర్షించారు. వారు తీసిన సంగీత కళాఖండం “శృతిలయలు” సినిమాలో నటించి, “ జానకీ కాంత స్మరణం” అటూ గొంతుకలిపారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 20వ తేదీన సాయంత్రం 7 గంటల నుండి 8 గంటలవరకూ పరిపక్వత చెందిన ప్రతిభతో, సుశాస్త్రీయమైన గాత్రంతో వాక్భూషణం, భూషణం అన్నట్లుగా డా. శ్రీమతి శారదా సుబ్రమణ్యం గారు భద్రాచల రామదాసులవారి కీర్తనలను గానం చేసి, సభికులను రంజింపజేశారు. ఈ కచేరీకి జగత్ప్రసిద్ధులైన తిరుపతి డా. కొమాండూరి వేంకట కృష్ణ గారు వయొలిన్ తో, తిరుపతి శ్రీ కోటిపల్లి రమేష్ గారు మృదంగంతో అత్యద్భుతంగా సహకరించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
కచేరీని విభిన్నంగా ప్రారంభించి, మొదట్లోనే మార్కులు కొట్టేశారు. శ్రీ రామదాసు గారు రచించిన “దాశరధీ శతకం” లో “దాచిన చుట్టమా శబరి” అనే పద్యాన్ని కళ్యాణి రాగంలో అద్భుతంగా ఆలపించి కచేరీకి శుభారంభం ఇచ్చారు. కొంత నిందాస్తుతి అయిన ఈ పద్యంలో భావాన్నీ, శ్రీ రామదాసు మనోవేదనను రాగా సదృశ్యం చేశారు. ఆ తరువాత ఇదే కళ్యాణిలో “నను బ్రోవమని చెప్పవే” అంటూ మిశ్రచాపు తాళంలో భావ లాలిత్యాన్ని అందించారు. ఆ తరువాత, అభేరి రాగాన్ని కొంచెం అలా చూపించారు. తన గురువుగారు సంగీత కళానిధి డా. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచిన ఇనకుల తిలక ఏమయ్యా రామయ్య కీర్తనను తిశ్ర గతిలో పాడి, శ్రీమతి శారద గారు తనదైన ముద్ర వేసుకున్నారు.
కాంభోజి రాగాన్ని సంతృప్తికరంగా వినిపించి, ఏమయ్యా రామా? అంటూ తన గురువుగారు స్వరపరచిన కీర్తనను ఖండచాపు తాళంలో ప్రధానాంశంగా ఎంతో హృద్యంగా గానం చేశారు. ఎంతో ప్రజ్ఞతో త్రిస్తాయి సంగతులను శారద గారు ఆలపిస్తున్నప్పుడు వారి తండ్రి, గురువు స్వర్గీయ ఐ.వి.ఎల్. శాస్త్రిగారు గుర్తుకు వచ్చారు. స్వరకల్పనలో దాటు స్వర ప్రయోగం చాలా ఆకట్టుకుంది. సహవిద్వాంసులు శ్రీ కృష్ణ గారు, శ్రీ రమేష్ గారు ప్రధాన గాయకురాలితో సమానంగా స్వర లెక్కలన్నీ అలా దింపేశారు. ఈ కీర్తనలో శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ కీర్తనను పోషించారు శ్రీ రమేష్ గారు.
ఈ ముగ్గురి సమన్వయం సభికులను ఎంతగానో అలరించింది. చివరిలో త్రికాల ముక్తాయి చాలా సమయస్పూర్తిగా అనిపించింది. ఈ అంశంలో తనియావర్తనం కోసం సభికులు ఎదురుచూశారు. కానీ సమయాభావం వల్లో, ఏమో కానీ, శ్రీ కోటిపల్లి రమేష్ గారు చిన్న ముగింపుతో ముగించేశారు. ఆతరువాత, మోహన రాగంలో ఖండ గతిలో సకలేంద్రియములారా అనే కీర్తనను ఆమోఘంగా ఆలపించారు. వెంటనే రారా నా వెన్న ముద్ద గోపాలా అంటూ ఖమాస్ రాగంలో పాడి, శ్రీ కృష్ణునిపై భక్త రామదాసు గారు రాసిన అపురూప కీర్తన వినిపించారు. చివరిగా యమునా కళ్యాణి రాగంలో నరహరి రూపా జనార్ధనా అంటూ ఎంత భక్తి భావంతో, శ్రుతిలో లీనమవుతూ పాడారో మాటల్లో చెప్పలేము.
ఇంత మనోహరమైన, హృదయ రంజకమైన సంగీత కచేరీని మీరూ వినండి. మీ ఆప్తులనూ వినేటట్లు చేయండి. తద్వారా సంగీతాన్ని ప్రోత్సహించండి. ఈ క్రింది లింకు నొక్కండి. వీలైనంత మందికి పంపించండి.

On 20.06.2024, Apuroopa Vaageeyakaara Vaibhavam - Dr G. SARADA SUBRAMANIYAM garu, Visakhapatnam - Vocal Concert went brilliantly in the Saptagiri Sangeeth...

*సుజన రంజనం అంజన గానం*మృదు మధురమైన శృతి శుద్ధత కలిగిన స్వరంతో విజయవాడ శ్రీమతి అంజనా సుధాకర్ గారు గానం చేస్తుంటే శ్రోతలంద...
25/10/2024

*సుజన రంజనం అంజన గానం*
మృదు మధురమైన శృతి శుద్ధత కలిగిన స్వరంతో విజయవాడ శ్రీమతి అంజనా సుధాకర్ గారు గానం చేస్తుంటే శ్రోతలందరూ ఏకోన్ముఖులయ్యారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటలవరకూ తన లలిత ఉదాత్తత నిండిన సుధారస గాత్రంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. వాగ్గేయకార శిరోమణి, భద్రాచల రామదాసులవారి అపర అవతారమూర్తి శ్రీ తూము నరసింహ దాసులవారి “లేరా నాపాలి శ్రీ వీర రాఘవ” అంటూ ఎంతో లలితంగా భూపాల రాగంలో మిశ్రాచాపు తాళంలో ప్రారంభించగానే, ఇప్పుడే తెల్లవారుతోందా అన్న అనుభూతి కలిగింది. అంతే సున్నితంగా వయొలిన్ పై తిరుపతి శ్రీ ఎల్. జయరాం గారు, మృదంగం పై తిరుపతి శ్రీ కంచి భాస్కర్ గారు ఊత మిచ్చారు. వసంత రాగాన్ని అలా కొంచెం రుచి చూపించి, శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరచిన శ్రీ అన్నమాచార్యులవారి “వాడే వేకటాద్రి మీద వర దైవము” కీర్తనను అందుకున్నారు. చురుకైన సంగతులతో ఆలపించారు. గురువుగారి అర్ధాంగి కాబట్టి శ్రీ జయరాం గారు ఎంతో అణుకువతో సహకరిస్తూనే, తనదైన శైలిని ప్రదర్శించారు. వయో వృద్ధులైన శ్రీ కంచి భాస్కర్ గారు ఉరుములు మెరుపులు వంటివి లేకుండా, అనవసరపు పైకాల వరసలతో గాయకురాలిని ఇబ్బంది పెట్టకుండా తగుమాత్రం అనుసంధానిస్తూ, తన పెద్దరికాన్ని చాటుకున్నారు.
తరువాత జగన్మోహిని రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి శోభిల్లు సప్తస్వర కీర్తనను సప్తస్వర శోభితంగా పాడి, ప్రేక్షకుల చప్పట్లనే దీవెనలు అందుకున్నారు. ఇప్పుడు కచేరీ మాంచి రసకందాయంలో పడింది. షణ్ముఖ ప్రియ రాగాన్ని ప్రధానాంశంగా ఎంచుకుని విస్తారంగా గానంచేశారు.
ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
ఈ కచేరీ సమయానికి రావలసిన గాత్ర, వయొలిన్ కళాకారులు కరణాంతరాల వల్ల రాలేకపోతే, నిర్వాహకులు అప్పటికప్పుడు అభ్యర్ధిస్తే, వారి శ్రీవారు ప్రముఖ సంగీత కళాకారులు శ్రీ మోడుమూడి సుధాకర్ గారు అంగీకారంతో, పెద్దామనసు చేసుకుని, (వారెవరో రాకపోతే.. నేనా !! అనకుండా) అప్పటికప్పుడు వేదిక నలంకరించి అద్భుతంగా గానం చేసి నిర్వాహకుల పరువు నిలబెట్టారు శ్రీమతి అంజన సుధాకర్ గారు. అదేవిధంగా వయొలిన్ పై ఆమోఘమైన సహకారాన్ని అందించిన శ్రీ ఎల్. జయరాం గారు కూడా.
ఏవిధమైన ముందస్తు ప్రణాళిక లేకుండా అచ్చమైన మనోధర్మాన్ని ఈ షణ్ముఖప్రియ రాగంలో శ్రీమతి అంజనా గారు ప్రదర్శించి మన్ననలు పొందారు. పద్మవిభూషణ్ డా. బాలమురళీ కృష్ణ గారి “సదా తవ పాద సన్నిధిం కురు” అనే కీర్తనను ఆదితాళంలో ఎంతో ప్రతిభతో గానం చేశారు. స్వరకల్పనలో శ్రీ సుధాకర్ గారి ఛాయలు కనిపించాయి. శ్రీ జయరాం గారు స్వరకల్పనలో పరిణతి చూపించారు. శ్రీ భాస్కర్ గారి తనియావర్తనం బాగుంది. అనంతరం చక్రవాకం రాగంలో “అది తాళలేకనే అంగన” శ్రీ సుధాకర్ గారు స్వరపరచిన శ్రీ అన్నమయ్య కీర్తన ఎంతో భక్తి భావంతో ఆలపించారు. మధ్యమవతి రాంగలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఉత్సవ సంప్రదాయ కీర్తన “శ్రీ రామ జయ రామ శృంగార రామయని” అంటూ ఎంత లాలిత్యం చూపించారో వర్ణించలేము. చివరిగా సింధుభైరవి రాగంలో ఆదిదేవ పమాత్మా అనే అన్నమాచార్యుల వారి కీర్తనతో కచేరీని సంపూర్ణం చేశారు.
ఈ కచేరీని మీరు వినండి. పదిమందికి వినిపించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞానికి ఫలితం పదిమందికీ అందించడంలో మీ వంతు సహకారం ఇవ్వండి.
ఈ క్రింద లింకు నొక్కండి.

2024, జూన్ 16 నుండి 23 వరకు నిర్విరామంగా 168 గంటలపాటు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం లో అత్యంత వైభవంగా జరిగిన సప్తగిరి సంగ...

*కోమల గాత్రం - కోకిల కంఠం – లావణ్య గానం*చెన్నైకి చెందిన వర్ధమాన గాయని, చిన్న వయస్సులోనే విఖ్యాతి గడించిన శ్రీమతి లావణ్య ...
24/10/2024

*కోమల గాత్రం - కోకిల కంఠం – లావణ్య గానం*
చెన్నైకి చెందిన వర్ధమాన గాయని, చిన్న వయస్సులోనే విఖ్యాతి గడించిన శ్రీమతి లావణ్య సుందరరామన్ శ్రీ పురందర దాస కీర్తనలను ఎంతో రమ్యంగా పాడి శ్రోతలను మెప్పించారు. ఈమె పాడుతుంటే, సంగీత సామ్రాజ్ఞి డా. డి.కే. పట్టమ్మాళ్ గుర్తుకువచ్చారు. మరోవైపు, ప్రఖ్యాత గాయకురాలు, పట్టమ్మాళ్ గారి మనవరాలు శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్ స్పురించారు. డి.కే. పట్టమ్మాళ్ గారి ముని మనవరాలు, శిష్యురాలు అయిన శ్రీమతి లావణ్యగారు వారిద్దరి బాణీలను అలవోకగా పట్టుకోగలిగారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 19వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి 6 గంటలవరకూ శ్రీ పురందర దాసులవారి కీర్తనలతో అద్భుతమైన శుద్ధ శాస్త్రీయ సంగీత విందును శ్రీమతి లావణ్య గారు అందించారు. వీరికి వయొలిన్ పై డా. కొమాండూరి వేంకట కృష్ణ గారు, మృదంగం పై శ్రీ ఏ. ఎస్. శంకర్ గారు, ఘటం పై శ్రీ బుద్ధవరపు మారుతీ రఘురాం గారు తమవంతు సహకారం అందించారు.
శ్రీమతి లావణ్య గారు శరణు సిద్ధి వినాయకా అంటూ సౌరాష్ట్ర రాగంలో మిశ్రచాపు తాళంలో ఎంతో గంభీరంగా కచేరీని ప్రారంభించారు. తరువాత అభేరి రాగాలాపనలో పై దైవతాన్ని స్పృశించి, తన ప్రతిభను ప్రదర్శించి, ఎంత చెలువగే మగలను అనే కీర్తనను ఆదితాళంలో ఎంతో భావయుక్తంగా పాడారు. కన్నడ కీర్తన అయినప్పటికీ, భాష తెలియనప్పటికీ శ్రోతలు ఎంతో ఆనందించారు. ఆమె గొంతులో ఈ కీర్తన అలా వొదిగిపోయింది. కొమాండూరి వారు ఈ కీర్తనలో సౌకుమార్యాన్ని ఇనుమడింపజేస్తూ సహకారాన్ని అందించారు. శంకర్ గారు, మారుతీ గారు బాగానే అనుసరించారు. ఔచిత్యం ఏమిటంటే, అన్నీ రక్తి రాగాలనే ఎంచుకోవడం.
వసంత రాగంలో ఖండ గతిలో రామ రామ అంటూ కొంచెం చురుకైన కీర్తన అందుకుని శ్రోతలను మంత్ర ముగ్డులను చేశారు. ఆ తరువాత, ప్రధానాంశంగా చారుకేశి రాగాన్ని ఎంతో విస్తారంగా ఆలపించి, ఎన్నెన్నో స్పురిత గమకాలను, వివిధ స్వర స్థాయి రూపాలను గానంచేసి, తన అకుంఠిత సాధానా పాటవాన్ని శ్రోతలకు చూపించారు. ఆమె కంఠస్వరంలో ఏదో తెలియని మెస్మరిజం ఉంది. హాలంతా మారుమ్రోగిపోయింది. సామాన్య వల్ల అనే కీర్తనను ఆదితాళంలో ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఇందులో చేసిన స్వరకల్పనలో తన మనోధర్మాన్ని ఆవిష్కరిస్తూనే, సహ కళాకారుల నుండీ ప్రతిభను వెలికితీశారు. రాగాలాపనలోనూ, స్వరకల్పనలోనూ డా. కృష్ణ గారు తన కళా విశ్వరూపాన్ని చూపించారు. శ్రీ శంకర్, శ్రీ మారుతీ గార్లు రెట్టించిన ఉత్సాహంతో వాయించి కీర్తనకు వన్నె తెచ్చారు. తనియావర్తనం చాలా సింపుల్ గా తేల్చేసినప్పటికీ ఆకట్టుకుంది. చివరిగా వాసంతి రాగంలో ఎంతో ఆర్తిగా అలపిస్తుంటే, నాలాంటి వారికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. బంధ మేలే రంగా బంధ మేలే అంటూ ఖండ గతిలో ఎంత ఆర్తిగా పాడారో మాటల్లో చెప్పలేము. కృష్ణా.. అంటూ పై పంచమం వరకూ వెళ్ళి ఆలపిస్తుంటే, ఆమె ఒక మీరాలా అగుపించారు. ఒక గోపీగా, ఒక రాధగా అనిపించారు. అలా పాడితే కృష్ణుడు రాక ఏమవుతాడు? వచ్చి తీరుతాడు. కానీ ప్రేక్షకులే రాలేకపోయారు.
చివరిగా, బసంత్ రాగంలో నరజన్మ బంధానే కృష్ణా ఎనబారదే అంటూ సంత్ హరిదాస్ గిరి రచనతో కచేరీ పరిసమాప్తం చేశారు.
దురదృష్టం ఏమిటంటే, ఈ కచేరీని వినలేకపోవడం. స్థానికంగా ఉన్న కళాకారులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోలేకపోయారు. తితిదే నిర్వహణలో సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రొజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వంటి సంస్థల్లో వందలమంది కళాకారులు ఉన్నారు. ఆయా సంస్థల అధిపతులకు స్వయంగా ఆహ్వాన పత్రాలు అందించినప్పటికీ ఏ విధమైన స్పందనా లేకపోవడం చాలా విచారకరం. వీటిల్లో సేవలందిస్తున్న కళాకారుల్లో కూడా చైతన్యం లేకపోవడం, మనకెందుకులే అనుకోవడం కొంత నిరుత్సాహ పరచిన మాట నిజం. ఇంతటి మహోన్నత కార్యక్రమంలో తమ శిష్యులను తప్పనిసరిగా పాల్గొనేటట్లు చేయవలసిన భాధ్యత సంగీత గురువులపై ఎంతో ఉంది. కానీ గురువులే రాలేదు. ఇంకా శిష్యులేం వస్తారు? ఇంత బ్రహ్మాండమైన కచేరీకి కనీసం 10 మంది కూడా లేనప్పటికీ, ఏమాత్రం నిరాశ చెందకూడా, తన గాత్రాన్ని భగవంతునికి అర్పిస్తున్నట్లుగా ఎంతో హృద్యంగా గానం చేశారు. అయితే, వీరి కచేరీని అప్యర సరస్వతీ స్వరూపులు అవసరాల కన్యాకుమారి గారు, పత్రి సతీష్ కుమార్ గారు విని ఆమెను మెచ్చుకుని, వేదికమీదకు వెళ్ళి, ఆశీర్వదించారు. అదిచాలు ఆమెకు.
ఇంతటి అద్వితీయమైన కచేరీని వినడం మీరు ఏమాత్రం విస్మరించకండి. విన్న తరువాత మీరే చెప్తారు కామెంట్ల రూపంలో. అదే విధంగా మరికొంత మందికీ పరిచయం చేయండి. శాస్త్రీయ సంగీత సౌరభాన్ని మీ సాధ్యమైనంత ఎక్కువ మందికి చవి చూపించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞానికి ఫలితం పదిమందికీ అందించడంలో మీ వంతు సహకారం ఇవ్వండి.
ఈ క్రింద లింకు నొక్కండి.

On19.06.2024, DASA SAHITYA SOURABHAM -Mrs. LAVANYA SUNDARA RAMAN, CHENNAI, Vocal concert went brilliantly in the Saptagiri Sangeetha Saptaham held in Tiru...

*వాగ్గేయమానం ఆకొండి గానం*ఒక వాగ్గేయ కారుడు తన కీర్తనలను స్వయంగా వేదికమీద పాడుతుంటే, చూడముచ్చటగా ఉంటుంది. తన రచనల్లోని భా...
23/10/2024

*వాగ్గేయమానం ఆకొండి గానం*
ఒక వాగ్గేయ కారుడు తన కీర్తనలను స్వయంగా వేదికమీద పాడుతుంటే, చూడముచ్చటగా ఉంటుంది. తన రచనల్లోని భావం ఇతరులకంటే, తనకే బాగా తెలుసు కాబట్టి, మరీటా భావ యుక్తంగా పాడి వినిపించగలుగారు. ఈ తరపు ప్రఖ్యాత వాగ్గేయకారులు పద్మవిభూషన్ డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కూడా మొత్తం కచేరీలో ఒకటో రెండో లేదా కొన్నో స్వంత రచనలు పాడటం మనం చూశాం. చాలా మంది వాగ్గేయ కారులు అంతే. కానీ, మొత్తం కచేరీ అంతా తన స్వీయ రచనలే గానం చేసి సభికుల మన్ననలు పొందడం ఒక్క శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారికే చెల్లింది.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి 5గంటలవరకూ శ్రీ రాజారావు గారి స్వీయ రచనా సౌరభం సభికులను అలరించింది.
తన గురువు గారు సంగీత కళానిధి శ్రీ నెదునూరివారి పుణికిపుచ్చుకుని, ప్రతీ అంశంలో శ్రీ కృష్ణమూర్తి గారిని దర్శింపజేశారు.
అభోగి రాగంలో వారణ వదనం అనే గణేశ స్తుతితో ప్రారంభించి, పటుత్వంగా స్వరకల్పన చేశారు. తిరుపతి శ్రీ జి. చక్రపాణి పాణి గారు వయొలిన్ పై చక్కగా అనుసరించారు. నూజివీడు మంగళగిరి శ్రీధర్ గారు ఈ కీర్తన ప్రారంభం నుండే తన గురువైన ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ కమలాకర రావు గారిని స్పురింపజేస్తూనే, తన విద్వత్తును చాటుకున్నారు.
హరి హృదయ వాసిని అని లక్ష్మీ దేవిని స్తుతిస్తూ, వాలజీ రాగం ఆది తాళంలో ఎంతో హృదయ రంజకంగా ఆలపించారు. ఆ తరువాత, పంతువరాళి రాగా సొగసులను సవిస్తరంగా సూక్ష్మతి సూక్ష్మ గమకాలతో ఆలాపన చేసి, వేదస్వరూపా వెంకటేశా అంటూ స్వామివారిపై ఉన్న అపార భక్తిని నివేదించారు. శ్రీ చక్రపాణిగారు కమాను కదళికల్లో మనోధర్మ ప్రదర్శనలో తన సీనియారిటీని, కళపట్ల తనకున్న సిన్సియారిటీని నిరూపించుకున్నారు. కీర్తనను అనుసరించడంలో, నెరవును పోషించడంలో స్వరకల్పనకు పోటీ ఇవ్వడంలో శ్రీ శ్రీధర్ పరిణతి ప్రదర్శించారు. ఇదే ప్రధానాంశం అన్నట్లుగా శ్రీ రాజారావు గారు తన గాత్ర ప్రతిభను ప్రదర్శించారు. తరువాత విటపి రాగంలో ఎటుల బ్రోతువో కీర్తనలో శ్రీరాముణ్ణి ఆర్తిగా వెదుకున్నారు ఆకొండి వారు. ప్రధానాంశంగా మధ్యమావతి రాగాన్ని ఎంచుకుని వారి గురువు గారిని గుర్తుచేస్తూ, తన్మయత్వంతో రాగాలాపన చేసి, సదా వటపత్ర వాసినం అంటూ శ్రీ దక్షిణామూర్తి వారిని స్తుతిస్తూ, సాగిన ఈ కీర్తనలో సాహిత్యం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ చక్రపాణిగారు లెక్కల్లో మనిషి అనిపించుకున్నారు. అదేవిధంగా, తక్కువ సమయంలోనే తనియావర్తనంలో మెరుపులు మెరిపించి, తనకు ఆకాశవాణి వారు *ఏ* గ్రేడు ఎందుకు ఇచ్చారో చెప్పారు. మోహరా కూడా విభిన్నంగా వాయించి, చివర్లో త్రికాల, త్రిగతి ముక్తాయి వాయించి, మృదంగ విద్వాంసుల ప్రశంసలు అందుకున్నారు.
నిజం చెప్పాలంటే, ఈ కచేరీకి 55 నిముషాలు సరిపోలేదు. కనీసం 2 గంటలైనా శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారికి కేటాయిస్తే బాగుడేది అనిపించింది. విందు భోజనంలో మజ్జిగ లేకుండానే మధ్యలో ముగించినట్లు అనిపించింది శ్రోతలకు. వారు అంతగా లీనమైపోయారు. కానీ, షెడ్యూలు ప్రకారం తారువాత కచేరీలు ఉండటం వల్ల వారి సమయాన్ని నిర్వాహకులు పొడిగించలేకపోయారు.
శ్రీ ఆకొండి వారు అందించిన మధురిమలను మీరూ ఆస్వాదించండి. మరికొంత మందికి పంచండి. శాస్త్రీయ సంగీత సౌరభాన్ని మీ సాధ్యమైనంత ఎక్కువ మందికి చవి చూపించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞానికి మీ భరోసా జతచేయండి.
ఈ క్రింద లింకు నొక్కండి.

2024, జూన్ 16 నుండి 23 వరకు నిర్విరామంగా 168 గంటలపాటు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం లో అత్యంత వైభవంగా జరిగిన సప్తగిరి సంగ...

*వాణీ వీణా నాదం – పులకించిన వాతావరణం* తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల వీణవిభాగాధిపతి, ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న శ...
22/10/2024

*వాణీ వీణా నాదం – పులకించిన వాతావరణం*
తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల వీణవిభాగాధిపతి, ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న శ్రీమతి యాళ్ళ శ్రీవాణిగారు వీణా వాదనాన్ని ప్రారంభించగానే హాలు అంతా ఒక రకమైన వాతావరణ నెలకొంది. మీటులో సునిశిత శైలి వారిది. తీగలను చాలా సున్నితంగా మీటుతూ, శృతి పక్వమైన నాదాన్ని అందిస్తూ, తాను ఆనందిస్తూ, సభికులను పారవశ్యులను చేశారు. తాళం తీగల మీటులో ఉండే లయ మాధుర్యాన్ని రుచిచూపించారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 16వ తేదీన సాయంత్రం 5గంటల నుండి 6గంటలవరకూ ఈ వీణా నాద వినోదం జరిగినది.
శ్యామ రాగంలో ఆదితాళంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారి కృతి అన్నపూర్ణే తో కచేరీని ప్రారంభించి, ఆ కీర్తనలో సౌకుమార్యాన్ని అందించారు. శ్రీ కోటిపల్లి రమేష్‌గారు, శ్రీ సరస్వతుల హనుమంతరావుగారు మృదంగ ఘటాలపై అంతే సున్నితంగా లయను పోషించారు. తరువాత కాంతామణి రాగాలాపనలో తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా, మంద్ర తీగలపై ఆమె కుడి చేతి వ్రేళ్ళు చురుకుగా కదులుతుంటే ఎడమచేతి వేళ్ళు వీణ మేళంపై నాట్యం చేస్తున్నాయనిపించింది. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి “ఏ దారి సంచరింతురా కీర్తనను ఆదితాళంలో ఎంతో అద్భుతంగా వినిపించారు. తక్కువ నిడివిలో చేసినా, స్వరకల్పన ఆకట్టుకుంది శ్రీ హనుమంతరావు గారికి ఎక్కువ అవకాశం ఇచ్చి, ఉప ప్రక్క వాయిద్యానికి పెద్ద పేట వేసి, తన సౌజనయాన్ని చాటుకున్నారు . శ్రీ కోటిపల్లి రమేష్ గారు. ఆ తరువాత ఒక చురుకైన అంశాన్ని వాయించి సభికులను అలరించారు. వీణకే ప్రత్యేకమైన తానాన్ని వరాళి రాగంలో వాయించి దేవ దేవుణ్ణి సాక్షాత్కరింపజేశారు. విస్తార రాగాలాపన చేసి, శ్రీ దీక్షితార్ వారి శేషాచాల నాయకం కృతిని రూపక తాళంలో ఆమోఘంగా వాయించి, స్వరకల్పనలో కచేరీని తారాస్తాయికి తీసుకెళ్లారు. శ్రీ రమేష్, హనుమంతరావు గార్లు తమ ప్రతిభను చాటుకున్నారు. చివరిగా సింధుభైరవి రాగంలో ఒక భజనతో కచేరీని పరిసమాప్తం చేశారు.
అపర సరస్వతి శ్రీమతి యాళ్ళ శ్రీ వాణిగాఋ వీణపై అందించిన మకరందాలను మీరూ గ్రోలండి. నాదానందాన్ని, శాస్త్రీయ సంగీత గుభాళింపును మీ చేరువులకు అందించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞం సఫలీకృతం చేయండి.
ఈ క్రింద లింకు నొక్కండి.

2024, జూన్ 16 నుండి 23 వరకు నిర్విరామంగా 168 గంటలపాటు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం లో అత్యంత వైభవంగా జరిగిన సప్తగిరి సంగ...

మాన్యులయిన మీకు శుభోదయ అభివాదములు 🙏🙏🙏మన పాస్ మనోవికాస్ యూట్యూబ్ చానెల్ను  దయచేసి subscribe చేసుకోండి.  ఈ చానెల్ను subscr...
22/10/2024

మాన్యులయిన మీకు శుభోదయ అభివాదములు 🙏🙏🙏

మన పాస్ మనోవికాస్ యూట్యూబ్ చానెల్ను దయచేసి subscribe చేసుకోండి.
ఈ చానెల్ను subscribe చేసుకోవడం ద్వారా.. వీడియోలు చూడటం ద్వారా, లైకులు ఇవ్వడం ద్వారా.. మీరు..

1. మరిన్ని సేవా సంగీత కార్యక్రమాలు వినూత్న రీతిలో చేయడానికి నన్ను ప్రోత్సహించగలరు.

2. ప్రఖ్యాత సంగీత విద్వాంసుల సంగీతాన్ని ఆస్వాదించ గలరు.

3. మన ఆశ్రమానికి సంబంధించిన అంశాలను వీక్షించి, మా సిబ్బందికీ, నాకూ ఉత్తేజాన్ని ఇవ్వగలరు.

4. ఈ చానెల్ ద్వారా ఆర్ధిక వనరులు సమకూరితే ( ఇప్పటి వరకూ లేదు) తద్వారా మన పిల్లల సంక్షేమానికి పరోక్షంగా దోహదపడగలరు.

5. 168 రోజులు నిర్విరామంగా చేసిన కృషికి ఫలితం అందించిన వారవుతారు.

దయచేసి మన మనోవికాస్ ఆశ్రమానికి ఈ విధంగా మీ సంపూర్ణ సహాయ సహకారములు అందించమని కోరుకుంటున్నాను.
ధన్యవాదములు.
మీ..
పున్నమరాజు మురళీ కృష్ణ, తిరుపతి
🙏🙏🙏

Good morning to you 🙏🙏🙏
Please subscribe our Paas Manovikas YouTube channel.

By subscribing this channel.. by watching videos, by giving likes.. you..

1. Can encourage me to do more service music programs in an innovative way.

2. Can enjoy the music of famous musicians.

3. Can view the aspects of our Ashram and give encouragement to our staff and myself.

4. If financial resources are collected through this channel (not yet) then we can indirectly contribute to the welfare of our children.

5. Can give fruitful result of our 168 days continuous nonstop hard work.

I request you to extend your full support to our Manovikas Ashram in this way.
Thank you
yours..
Punnamaraju Murali Krishna, Tirupati
🙏🙏🙏

నన్ను చూసి నవ్వకు!! నాతో కలిసి నవ్వు Don't Laugh at Us! Laugh with US Our key service areas is Manovikas, a Residential Special school for mentally Challenged children. We have been running this institution with the kind donations from humble...

*రాగ సుధారసం సుధాకర్ గానం* సంగీతాత్మీయుడు, విజయవాడ ఆకాశవాణి విశ్రాంత కళాకారుడు, టి. టి. డి.  ఎస్ వి రికార్డింగ్ ప్రాజెక్...
21/10/2024

*రాగ సుధారసం సుధాకర్ గానం*
సంగీతాత్మీయుడు, విజయవాడ ఆకాశవాణి విశ్రాంత కళాకారుడు, టి. టి. డి. ఎస్ వి రికార్డింగ్ ప్రాజెక్టు గౌరవ సలహాదారులు, ప్రపంచ ప్రఖ్యాత గాత్ర విద్వాంసులు, ఎంతో మందిని సంగీతాభిలాషులుగా మలుస్తున్న సంగీత సద్గురువులు శ్రీ మోదుమూడి సుధాకర్‌గారి సంగీత సుధా స్రవంతి శ్రోతలను ఆకట్టుకుంది. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 168 గంటల నిర్విరామ సంగీత సంతర్పణ .. సప్తగిరి సంగీత సప్తాహంలో భాగంగా 2024, జూన్ 16వ తేదీన రాత్రి 8 గంటల నుండి 9 గంటలవరకూ తన మృధుమధుర సుధా రస గానంతో పరవశింపజేశారు శ్రీ సుధాకర్ గారు.
చాలా ప్రశాంతంగా, కృష్ణ నదీ ప్రవాహి ఝరిల సాగిన ఈ కచేరీకి డా॥ కొమాండూరి వేంకట కృష్ణగారు వయోలిన్‌పై, సునాద సుధానిధి తిరుపతి శ్రీ ఎం. సుధాకర్‌గారు మృదంగపై సహకరించారు.
చలనాట రాగంలో ఖండచాపు తాళంలో పవనాత్మజా గచ్ఛ పరిపూర్ణ స్వచ్చ అనే శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారి కీర్తనతో ప్రారంభించి, సభలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకు వచ్చారు. సాధారణంగా, వాయిద్య సంగీతం తరువాత గాత్ర కచేరీ రక్తికట్టాలంటే, ప్రేక్షకులను తనవైపు త్రిప్పుకోవాలంటే, కొంచెం ఎక్కువ కష్టపడాలి. కానీ, శ్రీ సుధాకర్ గారు తన సుమధుర గానంతో మొదటి కీర్తనతోనే, సభికుల మార్కులు కొట్టేశారు. ఆ తరువాత శ్రీ రాగంలో ఆది తాళంలో శ్రీ శ్యామ శాస్త్రి గారు రచించిన కరుణ జూడు నిన్ను నమ్మిన వాడు గదా కీర్తనలో శ్రీ శ్యామ శాస్త్రిగారి హృదయాన్ని ఆవిష్కరిస్తూనే, తన మనోధర్మాన్ని కూడా ప్రదర్శిస్తూ ఎంతో ఆర్తిగా, లాలిత్యంగా, అమ్మను బ్రతిమాలుతున్నట్లుగా వినిపించారు. ఈ కీర్తనకు చాలా అద్భుతంగా ఎంతో అనుకూలంగా సహ విద్వాంసులు ఊతమిచ్చారు. శ్యామ శాస్త్రి, దీక్షితార్ గార్ల కృతులు సామాన్య జనాలకు అంతగా చేరువ కావు. అనేది సాధారణ నానుడి. కానీ, ఇక్కడ సభలో కూర్చున్నది సామాన్య ప్రేక్షకులా?? కాదు కాదు. ఉద్దండ పండితులు. అందుకే వారు తన ప్రతిభను నిరూపించుకునే విధంగా, సందర్భోచితంగా ఈ కీర్తనలు ఎంచుకున్నారు. సఫలీకృతులయ్యారు. అయితే, సామాన్య శ్రోతలు కూడా తలలు ఊపే విధంగా గానామృతంగా అందించారు. వెంటనే, ఎంతో విస్తారంగా, చాలా సునిశిత గమకాలతో హిందోళ రాగాలపన చేశారు. డా. కృష్ణ గారు అంతే సునాదంగా సౌకుమార్యంగా కమనుతో తన కళను అద్దారు. ఏమనుకున్నారో ఏమో!! నాలాంటి వారి కోసం, బహుళ ప్రాచుర్యమైన, అందరి నోళ్లలోనూ నానే,, మాదిలోనూ కదిలే *సమాజవరగమనా* అందుకున్నారు. ఈ కీర్తనకు నాద సుధానిధి శ్రీ ఎం. సుధాకర్ గారి మృదంగ నాద పోషణ మాటల్లో వర్ణించలేం. స్వరకల్పంలో ముగ్గురూ విజృంభించేశారు. మోడుమూడి వారు స్వరాల లెక్కలతో ప్రేక్షకులను ఆలోచింపజేశారు. సంగీత విద్యార్ధులు ఈ స్వరకల్పన ద్వారా ఎంతో నేర్చుకున్నారు. తిరుపతి శ్రీ ఎం. సుధాకర్ గారు తనియావార్తనంలో చాలా తక్కువ సమయంలోనే తానేమిటో తన వ్రేళ్ళ విన్యాసాల ద్వారా నిరూపించుకున్నారు. ఆతరువాత సింధుభైరవి రాగంలో శ్రీ ప్రయాగ రంగదాసు గారి *రామ రామ యనరాదా* కీర్తనను ఎంతో సద్భక్తికంగా పాడారు. నిర్వాహకుల కోరికపై శ్రీ మోడుమూడి వారు పాడితేనే వినాలనిపించే *రా రా మాయింటి దాకా* అసావేరి రాగంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనను ఎంతో ఆర్తిగా అందించారు. శ్రీ రాముణ్ణి నిజంగా పిలుస్తున్నట్లే ఉంది. చివరిగా డా. మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి తిల్లానాతో కచేరీని సంపూర్ణం చేశారు.
ఇంతటి మహోన్నత కచేరీ మీరూ వినండి. పదిమందికి వినిపించండి. 168 గంటల నిర్విరామ సంగీత యజ్ఞాన్ని చేసిన ఫలితాన్ని సఫలీకృతం చేయండి.
ఈ క్రింద లింకు నొక్కండి. రాగా సుధా స్వరాలను ఆస్వాదించండి.

2024, జూన్ 16 నుండి 23 వరకు నిర్విరామంగా 168 గంటలపాటు తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం లో అత్యంత వైభవంగా జరిగిన సప్తగిరి సంగ...

Address

Aadhyaatmika Kshetram Campus, VEDANTAPURAM (V), TIRUPATI RURAL (M), Chittoor District
Tirupati
517506

Alerts

Be the first to know and let us send you an email when PASS Manovikas Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PASS Manovikas Tirupati:

Share