13/04/2020
*TSUTF ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు*
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TSUTF) ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, టిఎస్ యుటిఎఫ్ సభ్యులు, కార్యకర్తలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.
అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో, హక్కులు, బాధ్యతలు రెండు నేత్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర ఉపాధ్యాయ ఉద్యమం ఆవశ్యకత చారిత్రక నేపద్యంలో ప్రాంతీయ అడ్డుగోడలను బద్దలుకొట్టి, మేనేజిమెంట్లు, కులాలు, క్యాడర్ల అంతరాల దొంతరలను అధిగమించి రాష్ట్ర వ్యాప్త ఉపాధ్యాయ సంఘంగా 1974 ఆగస్టు 10 న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ఆవిర్భవించింది. ఐక్య, స్వతంత్ర ఉద్యమాలతో విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు నాలుగు దశాబ్దాలపాటు ఎనలేని కృషి చేసింది. నాయకులు, కార్యకర్తల అసమాన త్యాగాలతో నిబద్ధత, నిజాయితీలకు మారుపేరుగా సంఘం రూపుదిద్దుకున్నది. అభ్యదయ భావజాలాన్ని, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించటానికి పాటుపడుతూ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. అత్యధిక ఉపాధ్యాయుల ఆదరాభిమానాలను పొంది ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా ఎదిగింది. రాష్ట్ర విభజన ఉద్యమంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూనే ప్రాంతీయ అవకాశవాదాలకు అతీతంగా ఉపాధ్యాయ ఉద్యమంలో ఐక్యతను కాపాడుకోవాలనే సూత్రబద్ద వైఖరితో నిలబడింది.
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో 2014 ఏప్రిల్ 13 న తెలంగాణ ప్రాంత పది జల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) ఏర్పాటైంది. రాష్ట్ర ఆవిర్భావం తేదీ (2014 జూన్ 2) నుండి టిఎస్ యుటిఎఫ్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం నలభై వేల సభ్యత్వంతో ముప్పైమూడు జిల్లాల్లో, ఐదువందల ఇరవై నాలుగు మండలాల్లో కమిటీలు కలిగి, రెండేళ్ళకొకమారు క్రమం తప్పకుండా మహాసభలు నిర్వహిస్తూ, వర్తమాన సమాజం, విద్యారంగం, ఉద్యమం, సర్వీసు నిబంధనలు, సంఘ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు తదితర అంశాలపై కార్యకర్తలకు శిక్షణ నిస్తూ సంఘ నిర్మాణాన్ని పటిష్ట పరుచుకుంటున్నది. 2014 డిసెంబర్ లో సంగారెడ్డిలో మొదటి మహాసభను, 2016 డిసెంబర్ లో మహబూబ్ నగర్ లో రెండో మహాసభను, 2018 డిసెంబర్ లో ఖమ్మంలో మూడవ మహాసభను విజయవంతంగా నిర్వహించి సంఘ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. సంఘాల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చిన పాలకుల అసహనాన్ని ధైర్యంగా ఎండగడుతూ ఉపాధ్యాయుల పక్షాన నికరంగా నిలబడింది. మహిళా ఉపాధ్యాయులలో నాయకత్వ అభివృద్ధిని టిఎస్ యుటిఎఫ్ ప్రోత్సహిస్తున్నది. ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల మొదటి జాతీయ సదస్సుకు ఆతిధ్యం ఇవ్వడంతోపాటు, రాష్ట్ర, జిల్లా మహిళా విభాగాలను ఏర్పాటు చేసి, వర్క్ షాపులు, శిక్షణాతరగతులు నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యమంలో మహిళా నాయకత్వం అభివృద్ధికి కృషి చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం ధ్యేయంగా గత ఆరు సంవత్సరాలుగా నిర్వహించిన స్వతంత్ర, ఐక్య ఉద్యమాలతో టిఎస్ యుటిఎఫ్ తనదైన గుర్తింపును పొందింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజలు కోరుకున్న విద్యను అందించాలని, పూర్వ ప్రాథమిక తరగతులు, సమాంతరంగా ఇంగ్లీషు మీడియం ఏర్పాటు, తరగతికొక ఉపాధ్యాయుడు, సెమీ రెసిడెన్షియల్ విధానంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను గురుకుల పాఠశాలల స్థాయికి దశలవారీగా అభివృద్ధి చేయాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది. సిపిఎస్ రద్దు, సర్వీసు నిబంధనలు, బదిలీలు, పిఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనాల సాధన తదితర సమస్యల పరిష్కారానికి యుయస్పీసీ, జెసిటియు, ఐక్య వేదికల ఏర్పాటు, ఉద్యమాల నిర్వహణలో క్రియాశీలక భాగస్వామ్యంతో పాలకుల నియంతృత్వ వైఖరిని నిర్ద్వంద్వంగా ఎండగట్టి పోరాటాలపట్ల, సంఘాల నిబద్ధత పట్ల ఉపాధ్యాయులలో విశ్వాసం నిలుపగలిగింది.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా మరింత పారదర్శకంగా జరపటంలో పట్టుదలగా కృషి చేసి విజయం సాధించింది. ఎయిడెడ్, గిరిజన సంక్షేమ, సింగరేణి, మోడల్ స్కూల్స్ తోపాటు అన్ని ప్రభుత్వ యాజమాన్యాల గురుకుల పాఠశాలల్లోకి విస్తరించి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ దినదిన ప్రవర్ధమానం చెందుతున్న ప్రజాతంత్ర ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ టిఎస్ యుటిఎఫ్. టిఎస్ యుటిఎఫ్ పూర్వ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన ఎ నర్సిరెడ్డి ఉమ్మడి ఉద్యమ ప్రతినిధిగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అత్యధిక ఓట్లతో ఎన్నికై ప్రభుత్వాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తూ ఉపాధ్యాయుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిబద్దతతో పనిచేస్తున్నారు. సామాజిక సేవలో సైతం ముందే ఉంటామంటూ టిఎస్ యుటిఎఫ్ కార్యకర్తలు పలు జిల్లాల్లో తరచుగా రక్తదాన శిబిరాలు, సమ్మర్ కోచింగ్ క్యాంపులు, స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహిస్తున్నారు. కేరళ వరదబాధితుల సహాయం కోసం ఒకరోజు వేతనం అందరితో పాటు ఇస్తూనే, కార్యకర్తలు ఐదులక్షల రూపాయలు సంఘం ద్వారా అందజేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంలో ఉద్యమం లో ప్రత్యక్షంగా పాల్గొనటంతో పాటు డిపోల స్థాయిలో ఎక్కడికక్కడ ఆర్థిక సహకారం అందించి కార్మికులను ఆదుకున్నారు. కొరోనా వైరస్ మహమ్మారి విస్తరణను కట్టడి చేయటం కోసం అమలుచేస్తున్న లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కార్మికులను ఆదుకునేందుకు సంఘం పిలుపునివ్వగా, జీతం సగమే వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మానవతాహృదయంతో స్పందించి ఉదారంగా ఇచ్చిన విరాళాలు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు అన్నార్తుల ఆకలి తీర్చటానికి ఉపయోగపడుతున్నాయి.
గత ఆరేళ్ళ టిఎస్ యుటిఎఫ్ ప్రస్థానం నేర్పిన పాఠాలతో రానున్న రోజుల్లో మరింత పట్టుదలతో టిఎస్ యుటిఎఫ్ ను బలోపేతం చేసి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య ఉద్యమాన్ని మరింత సంఘటిత పరచి హక్కుల సాధనకు, పోరాడి సాధించుకున్న సౌకర్యాల రక్షణకు అవిశ్రాంత కృషి సాగిస్తామని టిఎస్ యుటిఎఫ్ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.