26/04/2025
అమరావతి,డెల్టాటుడే న్యూస్ (26 ఏప్రిల్ 25)
• తలసీమియా చిన్నారులకు అండగా కొల్లా కుటుంబం.
• తన్నీరు తేజస్విని కి పునఃజన్మను అందించిన సాకేత్ ఫౌండేషన్.
• గుంటూరు తలసీమియా డే కేర్ సెంటర్ కి కొల్లా ఆర్ధిక సహాయం.
• కొల్లా శ్రీనివాస్ రావు ని అభినందించిన ఏమ్మెల్యే ఏలూరి సాంబశివరావు.
• ఏమ్మెల్యే చేతులమీదుగా చెక్కుల అందచేత.
• పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానన్న కొల్లా!
మన పరుచూరి మండలం కొల్లావారి పాలెం నివాసి(NRI) శ్రీ కొల్లా శ్రీనివాస రావు, లక్ష్మి గార్లు తలసీమియా చిన్నారులకు చికిత్స మరియూ సర్జరీలకోసం వారి కుమారుడి పేరుమీద స్థాపించిన “సాకేత్ ఫౌండేషన్” ద్వారా పదిహేను లక్షల ఆర్ధిక సహాయం అందచేశారు. శుక్రవారం పర్చూరు మార్కెట్ యార్డులో ఏమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కుల పంపిణీ చేసారు. యనమదల గ్రామంలో తలసీమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తేజస్విని కోసం బెంగళూరు లోని "మహావీర్ జైన్ హాస్పిటల్" వారితో సంప్రదించి ఆపరేషన్ కు కావలసిన "5 లక్షల రూపాయలు" అందచేసి చిన్నారికి పునర్జన్మని ప్రసాదించారు. అలాగే గుంటూరు లోని "తలసీమియా నీడ్స్ డే కేర్ సెంటర్" లో సేవలందుకొంటున్న చిన్నారుల వైద్య సేవలకు మరియూ మందుల కోసం పది లక్షల రూపాయల చెక్కు ని నీడ్స్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ గూడూరు శ్రీధర్ కి అందచేశారు. గూడూరు శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు కేంద్రంగా "తలసీమియా డే కేర్ సెంటర్" ని స్థాపించి చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాలలో తలసీమియా వ్యాధితో సతమతమవుతున్న చిన్నారులందరికీ ప్రతి పదిహేను రోజులకొకసారి సకాలంలో బ్లడ్ అందించడమే కాకుండా బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ సేవలు అందిస్తున్నామన్నారు. జన్యుపరమైన లోపం వలన బాధపడే ఈ తలసీమియా చిన్నారులకు నీడ్స్ సొసైటీ ద్వారా గత పదిహేను సంవత్సరాలుగా సేవలందిస్తున్నామని మొదట్లో పది మంది కోసం మొదలుపెట్టిన తమ డే కేర్ సెంటర్లో ఇప్పుడు 100 మందికి పైగా చిన్నారులకు సేవలందిస్తున్నామన్నారు. మూడు సంవత్సరాల క్రితం తమ "డే కేర్ సెంటర్" ని సందర్శించిన శ్రీ కొల్లా శ్రీనివాస రావు,లక్ష్మి గార్లు తక్షణ సహాయంగా ఎనిమిది లక్షలు అందించారు. అప్పటినుండి సందర్భం వచ్చినప్పుడల్లా ఎంతోమందికి ఆర్ధికసహాయంతో ఆదుకొంటున్నారని, ఈ రోజు కూడా ఐదు లక్షల ఆర్థిక సహాయంతో ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. ఈ ఆర్ధిక సహాయం ద్వారా మా భాద్యత మరింత పెరిగిందనీ ఇంకా ఎక్కువ మందికి సేవచేసే అవకాశం కల్పించిన కొల్లా శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబానికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ సమాజహితం కోసం పాటుపడుతూ ఆర్ధికసహాయం ద్వారా ఎంతోమందిని ఆదుకొంటున్న కొల్లా శ్రీనివాసరావు గారు మన ప్రాంత నివాసి అవడం చాలా గర్వంగా ఉందని ప్రశంసిస్తూ ఇకముందు కూడా మీ సేవలు కొనసాగించాలని కోరారు. దాత కొల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆపదలో వున్నవారికి తన చేతనైన సహాయం చేస్తూ కొల్లా కుటుంబం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో, నాగుబండి సుబ్బారావు, కొల్లా అశోక్ తో , పోట్రు వీరయ్య చౌదరి పాటు పలువురు MPP, ZPP సభ్యులు, గ్రామ సర్పంచులు, రైతులు , గ్రామ పెద్దలు పాల్గొని దాత కొల్లా ని అభినందించారు.