నరసాయ పాలె గ్రామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లాలో బాపట్ల మండల పరిధిలో ఉన్న అతి పెద్ద పంచాయతీలలో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామము లో 1573 ఇల్లు ఉన్నాయి. ఈ గ్రామములో మొత్తం 5219 మంది జనభా ఉన్నారు. వీరిలో 2571 మగవారు,2648 ఆడవారు ఉన్నారు. అంతేకాక ఈ గ్రామము చెరుకూరు, జమ్ములపాలెం, కంకటపాలెం సరిహద్దులుగా కలిగి ఉన్నది. ఇంకా ఈ ఊరు చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే అక్షరాస్యత శాతం ఎక్కువ
. ఈ గ్రామం 4 చెరువులతో ఎంతో రమ్యం గా ఉంటుంది మరియు ఈ గ్రామం నుంచి కృష్ణా నది యొక్క కాలువ ప్రవహిస్తుంది, కావున ఇక్కడ పంటపొలాలు సస్యశ్యామలంగా పండుతాయి. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరం గా ఉంటుంది. ఈ గ్రామము లో ఉన్న శ్రీ పమిడి అంకమ్మ ఉన్నత పాఠశాల 1962 నుంచి ఎంతో మంది విద్యార్ధులను మేధావులుగా తయారు చేస్తుంది. వారు అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతలు గడించారు, గడిస్తున్నారు కూడా.
అంతేకాక ఈ ఊరు ఆధ్యాత్మిక రంగంలో కూడా ముందంజ లో ఉంది. ఇక్కడ ఉన్న రామాలయంలో ఏటా ఎన్నో పూజలు, పండుగలు, యజ్ఞాలు, సప్తాహాలు ఆలయ కమిటీ అధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆలయ కమిటీ మహిళలు కావటం విశేషం మరియు శ్రీ రామ నవమికి, హనుమజ్జయంతికి గ్రామము లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ గ్రామానికి గ్రామదేవత “శ్రీ పోలేరమ్మ తల్లి”, కానీ ఇప్పుడు ఆ గుడి జీర్ణావస్థకి చేరింది. ఇప్పుడు దీని జీర్ణోద్దరణ కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలకి చుట్టూ పక్కల గ్రామాల నుండి జనాలు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఊరిలో ఒక గ్రంధాలయం కూడా ఉంది దానిలో అనేక రకాల పుస్తకాలు లభిస్తాయి మరియు ఈ గ్రామంలో వైద్య సదుపాయం కూడా ఉంది. ఇక్కడి ప్రజలందరూ కలిసి కొంతమంది దతలతో కలిసి ఆసుపత్రులు కట్టించారు. ఇందులో ఒక కంటి ఆసుపత్రి కూడా ఉన్నది. ఈ ఆసుపత్రుల సహాయంతో ఉరిలో రోగాల శాతం తగ్గింది. వీటి వలన ఉరిలో ఆరోగ్యపరంగా ఎంతో అభివృద్ధి చెందింది. రక్షిత మంచి నీటి పదకము ద్వారా ఈ గ్రామములోని ప్రజలు స్వచ్చమైన నీటిని పొందగలుగుతున్నారు.
అంతేకాక ఈ గ్రామంలో చర్చి మరియు మసీద్ ఉన్నాయి. ఈ గ్రామంలో ఉన్న చర్చి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చర్చీల కన్నా పెద్దది. ఇక్కడ ఉన్న చర్చిలో సువార్త సభలు మరియు క్రైస్తవ మతానికి సంబంధించిన వేడుకలు నిర్వహించబడును. అలానే మసీద్ లో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపబడును. ఈ గ్రామంలో ప్రజలందరూ కుల, మత బేధం లేకుండా కలిసి మెలిసి ఉంటారు. ఈ గ్రామం లో ప్రజలందరూ కలిసి ఈ మధ్యనే ఒక కళ్యాణమండపాన్ని కూడా కట్టించటం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా, చైతన్యవంతంగా ఉండటానికి ఊరి పెద్దలు ఈ మండపంలో ప్రతి ఆదివారం యోగ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. సాంకేతికపరంగా కూడా ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వాడుతున్న సోలార్ పవర్ అందుకు ఉదాహరణ. అంతేకాక ఈ గ్రామంలో ప్రజలు సాంకేతికంగా ఎంతో అవగాహన పెంచుకున్నారు. ఇక్కడ వ్యవసాయంలో సాంకేతిక పరికరాలు వాడటం దీనికి ఉదాహరణ.