09/08/2026
మా ఊళ్ళో వర్షం పడుతుందా?
కంచి కామకోటి పీఠం పీఠాధిపతుల్లో ఎందరో పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ భారతదేశం నలుమూలలకు వెళ్లి ధర్మప్రచారం చేసి జనులను అనుగ్రహించారు. బయటి ప్రపంచానికి తెలియని మారుమూల పల్లెలను కూడా వారు తమ యాత్రలో దర్శించి, లక్షల మందిని ధర్మానికి చేరువ చేశారు. అలాగే పరమాచార్య స్వామివారు కూడా తమ జీవితకాలంలో ఎన్నో మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు.
స్వామివారి అటువంటి ఒక యాత్ర బెల్గాంక్కు. కర్ణాటకలో ఉన్న ఈ ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. మహాస్వామివారు ఆ జిల్లాలోని ఒకానొక మారుమూల పల్లెలో తమ పరివారంతో పర్యటిస్తున్నారు. ఆ యాత్రలో భాగంగా స్వామివారు ఎందరో అమాయక పల్లెటూరి ప్రజలను కలిశారు.
ఈ యాత్రలో స్వామివారి ముఖ్య సేవకుడు రాయవరం బాలు మామ. వారు ప్రస్తుతం వెళ్తున్న ప్రాంతం వర్షాలు లేక భూములు ఎండిపోయి, అత్యంత తీవ్రమైన నీటి ఎద్దడితో ఉండి, ఎక్కడా పచ్చదనమే లేని భూభాగం. చూద్దామంటే కూడా ఎక్కడా ఒక్క నీటి చుక్క కూడా కనబడదు. అక్కడి ప్రజల పరిస్థితి, ముఖ్యంగా నీటికష్టాలు, వర్ణనాతీతం.
అటువంటి ఈ ఎడారి ప్రాంతంలో మహాస్వామివారు దండం చేతబట్టుకుని, భరించలేని ఈ ఎండలో, శరీరంపై ఏమాత్రం స్పృహ లేకుండా, చాలీచాలని వస్త్రాలతో నడుచుకుంటూ వెళ్తున్నారు. అటువంటి స్వామిని వారు ఎన్నడూ చూడకపోవడంతో ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. క్షణాల్లో దాదాపు నలభై మంది స్వామివారి బృందాన్ని చుట్టుముట్టారు.
ఇక ముందుకు అడుగువేయడానికి కుదరకపోవడంతో స్వామివారు నిలబడిపోగా, బాలు మామ కూడా ఆగిపోయారు. స్వామివారు వారిని చూడగానే వారు అడగబోయే సందేహాలను అర్థం చేసుకున్నారు.
“ఈ సాధువు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తోడుగా ఉన్నవారు ఎవరు? ఎక్కడికి వెళ్తున్నారు?”
స్వామివారు బాలు మామ వైపు తిరిగి, “వారు కేవలం మనం ఎవరో తెలుసుకోవాలని చుట్టుముట్టారు. కొట్టడానికి వచ్చారనుకున్నావా?” అని పరిహాసం చేస్తూ, “మనం ఎవరో, ఎక్కడికి వెళ్తున్నామో వివరంగా చెప్పు” అని ఆదేశించారు.
వెంటనే బాలు మామ అక్కడున్నవారితో, “వీరు కంచి పరమాచార్య స్వామివారు. మాకు గురువులు. జగద్గురువులు కూడా. మన కష్టాలను స్వామివారి ముందు పెడితే అవి క్షణాల్లో మాయం అవుతాయి. మేమందరం తమిళనాడులోని కాంచీపురం నుండి వస్తున్నాము. దేశసంచారం చేస్తూ మీ పక్క ఊరికి వెళ్తున్నాము. అక్కడ కొన్ని రోజులు ఉంటాము” అని చెప్పారు.
ఈ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో వెళ్లాల్సిన ఊరు ఉంది. బాలు మామ చెప్పడం ముగించగానే, ఆ గుంపులో నుండి భారీ కాయుడైన ఒక వ్యక్తి, బహుశా ఊరి పెద్ద అనుకుంటా, ముందుకు వచ్చి స్వామివారికి ఎదురుగా నిలబడ్డాడు.
అతడు బాలు మామ వైపు వేలు చూపిస్తూ, “ఇతను చెబుతున్నాడు, మీరు ఏది అడిగితే అది ఇస్తారని. మాకు ఇప్పుడు అత్యవసరంగా ఒకటి కావాలి. చాలా ఏళ్లుగా ఇక్కడ కరువు తాండవిస్తోంది. వర్షాలు లేక వ్యవసాయం ఆగిపోయింది. మాకు వర్షం కురిపించగలరా?” అని ఆదేశించినట్టుగా అడిగాడు.
స్వామివారు ప్రశాంతంగా అతని వైపు చూశారు. చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తూ, కనుచూపుమేరలో కనిపిస్తున్న ఒక కొండను చూపిస్తూ, “ఆ కొండపైన శివాలయం ఉందా?” అని అడిగారు.
అక్కడున్నవారందరూ స్వామివారు చూపించినవైపు చూసి, వారెవరికీ ఆ విషయం తెలియనట్టు నిలబడ్డారు. స్వామివారిని ప్రశ్నించిన వ్యక్తి కొందరు ముసలివారిని ఆ విషయమై అడగగా, ఎవరూ తెలియదన్నారు. ఎవరూ చెప్పకపోవడంతో అక్కడ శివాలయం లేదని, దాని గురించి ఎవరికీ తెలియదని చెప్పాడు.
“అక్కడ శివాలయం ఉంది” అని నిక్కచ్చిగా చెప్పారు స్వామివారు.
“చాలా ఏళ్లుగా అక్కడి శివయ్యకు అభిషేకం లేక నీటి కోసం అలమటిస్తున్నాడు. మీ ఊరివారందరూ కలిసి 1008 బిందెల నీటితో ఆ శివలింగానికి అభిషేకం చేస్తే, మీ సమస్య తీరుతుంది” అని చెప్పి స్వామివారు ముందుకు కదిలారు.
ఆ విషయాన్ని అక్కడితో వదలడానికి ఇష్టపడని ఆ గ్రామపెద్ద, “స్వామి! మాకు నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. తాగడానికి, నిత్యావసరాలకు కూడా పక్కన ఉన్న ఊరిపై ఆధారపడ్డాము. మాకు అన్ని బిందెల నీళ్లు ఎలా వస్తాయి?” అని అడిగాడు.
అంతేకాదు, అంత నీరు ఉంటే ఇంటి అవసరాలకు వాడుకుందాము అనుకుంటారు కానీ అభిషేకం చేయాలనుకోరు అని స్వామివారితో వాదించడం చూసిన స్వామివారి సేవకులు అతని ప్రవర్తనను చూసి విసుగుచెందారు.
“స్వామివారు చెప్పింది విని పాటించక, ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు?” అని వాళ్లలో వారు మాట్లాడుకుంటున్నారు.
కానీ స్వామివారు మాత్రం, “శివయ్యకు అభిషేకం చేయండి. అంతా మంచి జరుగుతుంది” అని కాస్త పెద్ద పెద్ద అడుగులతో నడవడంతో పరివారం కూడా నడక వేగాన్ని పెంచారు.
ఏమీ తోచక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్న వారిలో ఒక ముసలి వ్యక్తి ముందుకు వచ్చి, “మనతో మాట్లాడిన ఆ స్వామి మొహంలో తేజస్సును చూస్తే, వారు చెప్పినది నిజమనిపిస్తోంది. ఇప్పుడు ఆలోచిస్తే, చిన్నప్పుడు మా నాన్నవాళ్లు మాట్లాడిన మాటల వల్ల, నాకు కూడా అక్కడ శివాలయం ఉండి ఉండవచ్చనిపిస్తోంది. మనం చూడలేదు కాబట్టి అక్కడ ఆలయం లేదు అనుకోవడం సబబు కాదు.
“మనం ఆ స్వామివారి మాట విని, మనమందరం రేపు ఉదయం ఒక బిందె తీసుకుని పక్క ఊరికి వెళ్లి నీరు తెచ్చుకుందాము. ఈలోగా మనలో ఒకరు ఆ కొండ ఎక్కి ఆ శివాలయాన్ని వెతుకుదాము. అందరమూ తలా ఒక బిందెడు నీరు కొండపైకి తీసుకువెళ్దాము. లేకపోతే ఆ తెచ్చిన నీటిని మన ఇంటి అవసరాలకు వాడుకుందాము” అని చెప్పగా, అందరూ ఆ ముసలాయన మాటలకు సమ్మతించి మెల్లగా అక్కడినుండి వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఉదయం ప్రతి ఇంటి నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు—అలా అందరూ కలిసి పక్క గ్రామానికి వెళ్లి 1008 బిందెల నీరు తీసుకురావడానికి వెళ్లారు.
ఇంతలో ఇద్దరు కొండపైకి ఎక్కి ఆ శివాలయాన్ని కనుక్కున్నారు. అందులో ఉన్న శివలింగం చాలా అద్భుతంగా ఉంది. వారిద్దరూ అక్కడి పరిసరాలను శుభ్రపరిచారు. స్వామివారు చెప్పే వరకు వారికి అసలు తెలియని ఈ శివాలయం గురించి ఎంతో అబ్బురపడ్డారు.
గ్రామస్తులందరూ అతి కష్టం మీద 1008 బిందెలతో కొండపైకి ఎక్కి అభిషేకం పూర్తిచేశారు. బహుశా ఈ చర్య శివయ్యను తృప్తిపరచి ఉంటుంది.
గ్రామస్తులందరూ ఇళ్లకు తిరిగొచ్చి ఆశతో ఆకాశం వైపు చూస్తున్నారు. అభిషేకం చేస్తే వర్షం వస్తుందని స్వామివారు చెప్పారు. అభిషేకం చేశాము కానీ వర్షం జాడ కూడా లేదే అని అందరూ ఆలోచిస్తున్నారు.
కొద్దిసేపటి తరువాత వారు మోసపోయామని నిర్ధారణకు వచ్చారు.
“ఆ స్వామి మాటలు విని ఇంత కష్టపడి అభిషేకం చేస్తే వర్షం రాలేదు. ఆ స్వామి మనల్ని మభ్యపెట్టారు” అని కోపంగా అన్నాడు ఒక గ్రామస్తుడు.
వెంటనే ఆ గ్రామపెద్ద కూడా కోపంతో, “అవును, ఆ సన్యాసి మనల్ని మోసం చేశాడు. వారిని అలా వదిలేయకూడదు. పక్క గ్రామంలోనే ఉంటామని చెప్పారు కదా! పదండి వెళ్దాం. అందరూ కర్రలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితిలోనూ వాళ్లను ఇవాళ వదిలిపెట్టకూడదు. వాళ్లో మేమో తేలిపోవాలి ఈరోజు” అని ఊగిపోతూ అందరినీ రెచ్చగొట్టాడు.
పది నిమిషాల్లో అందరూ మరలా ఒక్కచోటికి వచ్చారు. ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో టార్చ్తో. అందరూ ఆవేశంతో ఉన్నారు కానీ కనీసం ఆలోచన కూడా చేయడం లేదు—మనం చేస్తున్న ఈ పని సరైనదేనా అని.
ఎన్నో సంవత్సరాలుగా అసలు ఎవరికీ తెలియని స్వామివారు, ఇక్కడివారు కాకపోయినా అక్కడ శివాలయం ఉందని చెప్పిన స్వామివారిని కొట్టడానికి వెళ్తున్నాము, ఇది తప్పు అన్న వివేకం అసలు లేదు.
అంతమందిలో ఒక్కడు మాత్రం మిగిలినవాళ్లలా కాకుండా, కాస్త ఆవేశం చల్లబడిన తరువాత, “స్వామివారిని కొట్టడానికి వెళ్లడం సరికాదు. వారు చెప్పిన విషయం జరగలేదన్న ఒక్క కారణంతో వాళ్లందరినీ కొట్టడం తప్పు. కానీ నేను ఇప్పుడు ఇలా చెబితే వీళ్లందరూ నన్ను కొడతారు” అని అనుకున్నాడు.
ఇక్కడి నుండి స్వామివారు మకాం చేస్తున్న ఊరు ఐదు కిలోమీటర్లు. తాను దగ్గరి దారిలో వెళ్తే వీళ్లందరికంటే ముందే వెళ్లి స్వామివారికి ఈ విషయం చెప్పవచ్చు అనుకున్నాడు.
కొద్దిగా మెల్లగా నడుస్తూ, కొంచెం కొంచెంగా గుంపు నుండి వెనకపడి, ఎవరికీ అనుమానం రాకుండా అవకాశం రాగానే మరొక దారిలో నడవడం మొదలుపెట్టాడు.
సరిగ్గా అరగంట తరువాత స్వామివారున్న చోటు చేరుకున్నాడు. ఊరిజనం రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. దాదాపు అందరూ నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధమవుతున్నారు.
అక్కడ ఎవర్ని పలకరించాలో ఇతనికి అర్థం కాలేదు.
ఈ విశ్వంలో జరిగే ఏ విషయమైనా పరమాచార్య స్వామివారికి తెలుసు. బాలు మామను పిలిచి, “పక్క ఊరి వ్యక్తి బయట నీకు కనిపిస్తాడు. వెంటనే ఇక్కడకు తీసుకురా” అని చెప్పారు స్వామివారు.
బాలు మామ బయటకు వెళ్లగానే ఇతను కనబడ్డాడు. బాలు మామకు విషయం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా, అదేమీ పట్టించుకోకుండా అతణ్ని రమ్మని పిలిచి చేయిపట్టి లాక్కునివెళ్లి స్వామివారి ముందుంచాడు.
అతని ఆనందాశ్చర్యానికి అవధులు లేవు. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, స్వామివారు ఊరి నుండి వెళ్లిపోయిన తరువాత నుండి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు అన్నీ వివరంగా చెప్పాడు.
ఊరివారందరూ వస్తున్నారన్న విషయం వినగానే బాలు మామ వణికిపోయి, వెంటనే బయటకు తొంగి చూశాడు. కనుచూపుమేరలో ఎవరూ లేకపోవడంతో కాస్త కుదుటపడ్డాడు.
మహాస్వామివారు మాత్రం, “అవునా, అలాగా?” అని చల్లగా నవ్వుతూ బయటకు వెళ్లారు.
బాలు మామకి ఏమీ అర్థం కావడంలేదు.
“ఈ మంచివ్యక్తి మన బాగుకోసం అన్ని విషయాలు చెబితే, ఆత్మరక్షణ కోసం ఏమీ ఆలోచించకుండా చల్లగా బయటకు వచ్చి నిలబడ్డారు స్వామివారు. అసలు ఈ సమయంలో బయటకు రావడం ఎందుకు? వారు వచ్చేలోపు అమూల్యమైన ఈ సమయాన్ని వృథా చేయడమెందుకు?” అని అనుకున్నాడు.
కొంచెం ధైర్యం తెచ్చుకుని, “చూస్తూ ఉంటే ఆ వచ్చే గుంపు మనం చెప్పే మాటలు వినేటట్టుగా లేరు. మనల్ని ఈ ఊరికి ఆహ్వానించినవారి వద్దకు వెళ్లి, విషయం మొత్తం చెప్పి, మనకు రక్షణగా కొందరిని తీసుకుని వచ్చేదా?” అని అడిగాడు.
స్వామివారు మౌనంగా నిలబడ్డారు.
ఆ గ్రామస్తునికి ఏమీ అర్థం కావడం లేదు.
“నేను ఇక్కడకు వచ్చి విషయం ముందుగా చెబితే స్వామివారికి సహాయం అందరూ రక్షణ కోసం ఏదైనా చేస్తారని అనుకున్నాను. కానీ స్వామివారిలో ఏమాత్రం ఆందోళన లేదు. చూస్తుంటే కోపంతో ఊగిపోతున్న ఆ గుంపుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు” అనుకున్నాడు.
ఏమీ అర్థం కాక ప్రశ్నార్థకంగా స్వామివారిని, బాలు మామను మార్చి మార్చి చూస్తున్నాడు. ఇక చేసేదేమీ లేక స్వామివారికి ఏ ఆపదా రాకూడదని మనసులోనే ప్రార్థిస్తున్నాడు.
స్వామివారు వీళ్లిద్దరి ఆలోచనలు, అనుమానాలు, భయాలు ఏమీ పట్టించుకోకుండా దూరంగా ఉన్న కొండపై ఉన్న శివాలయం కేసి చూస్తున్నారు.
అంతలోనే ఆకాశంలో తీవ్రమైన మార్పులు సంభవించాయి. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. సన్నటి ఉరుములు, మెరుపులతో మొదలై చిన్నగా చినుకులు మొదలయ్యాయి. చినుకులు వానగా మారి, అంతలోనే జడివానగా కురవసాగింది.
చేతులు జోడించి నమస్కరించి, కళ్లలో నీరు రాలుతుండగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ గొంతు మూగబోయింది.
మహాస్వామితో సహా అందరూ వర్షంలో తడిచిపోయారు.
ఊరివారందరూ స్వామివారు ఉన్న చోటుని వెతుక్కుంటూ అక్కడకు చేరుకున్నారు. కానీ ఆ వర్షంలో తడిసి వారి అహంకారమూ, అజ్ఞానమూ, కోపావేశమూ వర్షపునీటిలో కొట్టుకుపోయాయి.
“కర్రలు పడేయండి. ఈయన సాధారణ సన్యాసి కాదు. దేవుడు. మనల్ని ఈ కరువు నుండి కాపాడడానికి వచ్చిన దేవుడు” అని గ్రామపెద్ద ఆజ్ఞాపించడంతో కర్రలు పారవేసి అందరూ స్వామివారి వద్దకు చేరుకున్నారు.
“ఈ స్వామి గురించి మనం తప్పుగా మాట్లాడాము. నేను కూడా ఈయన పాదాలపై పడి మన తప్పును క్షమించమని వేడుకుందాము” అని అందరూ సంపూర్ణ శరణాగతితో స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
స్వామివారు నవ్వుతూ, “వర్షం జోరుగా కురుస్తోంది. ఈ రాత్రికి అందరూ ఇక్కడే ఉండండి. ఉదయం వెళ్లవచ్చు” అని చేయెత్తి అందరినీ ఆశీర్వదించి, బాలు మామ తోడురాగా స్వామివారు లోపలికి వెళ్లిపోయారు. ఆ రాత్రి మొత్తం కరువు తీరేలా కురిసిన వర్షానికి వారి కరువు తీరిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు!
--- “మహా పెరియవా” సంకలనం నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
దీవ్యత్ కృపామృత తరంగిత సత్కటాక్షం
కాంచీశ్వరీ రుచిర చిత్కళయా సుదీప్తం
దాక్షిణ్యమూర్తిమిహ సంయమినం వరేణ్యం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి నిత్యం ।।
#కంచిపరమాచార్యవైభవం