02/09/2023
🙏🙏🙏🌹🌹🌹
సకల కార్యసిద్ధికి శమీపూజ.....
హిందువులు చేసుకునే ప్రతి పండగ వెనుక శాస్త్రపరమైన, సంప్రదాయపరమైన కారణాలు ముడిపడి ఉంటాయి. అలాంటి పండగల్లో విజయదశమి ఒకటి. ఈ పండగనాడు శ్రీవైష్ణవ దేవాలయాలలో సకల కార్యసిద్ధికై శమీపూజను ఆచరించటం అనాదిగా వస్తోంది. అంతటి విశిష్టత కలిగిన శమీపూజ వెనుక పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథనం ఉంది..
దేవదానవుల భీకరమైన పోరులో భాగంగా వాసుకిని త్రాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి పాలసంద్రాన్ని మదించారు. ఆ సమయంలో పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మి, కామధేనువు, కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా ఉద్భవించినట్లు చెబుతారు. ఆ విధంగా పాల సముద్రం నుంచి జనించిన దేవతా వృక్షాలలో శమీ వృక్షం (జమ్మి చెట్టు) కూడా ఒకటి. హిందూ సంప్రదాయంలో ఆచరించే యజ్ఞయాగాలు ఆచరించే ముందు రెండు దారువులతో (కర్రలతో) అగ్నిని జ్వలింప చే స్తారు. ఆ విధంగా బాలాగ్నిని జ్వలింప చేసేందుకు వినియోగించే దారువు శమీవృక్షానికి చెందినదే కావటం విశేషం. ఆ విధంగా జనించిన అగ్నిని భగవంతుని రూపంగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించటం, యజ్ఞ, యాగాదులలో అగ్నిని జ్వలింపచేయటానికి వినియోగపడటంతో శమీ వృక్షానికి అంతటి విశిష్టత ఆపాదించబడింది.
శత్రువినాశిని..
అదే విధంగా ‘శమీ శమయతే పాపం, శమీ శతుృవినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని’ అని చెబుతారు. ఈ ఆర్యోక్తి ప్రకారం శమీ వృక్షం పాపాలను పోగొడుతుందని, శత్రువులను నాశనం చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా మహాభారతం, రామాయణాది పురాణాలలో కూడా శమీవృక్ష విశిష్టతకు సంబంధించి తార్కాణాలున్నాయి. మహాభారతంలో శకుని సహాయంతో కౌరవులు ఆడిన మాయాజూదంలో పాండవులు ఆట నియమం ప్రకారం పద్నాలుగేళ్లు అరణ్యవాసం తర్వాత, ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం కోసం విరాట రాజు కొలువులో వివిధ పేర్లతో చేరతారు. అదే సమయంలో తమకు దేవతా ప్రసాదితాలైన అమూల్య ఆయుధ సంపత్తిని విరాట రాజ్యానికి సమీపంలోని అరణ్యంలో శ్రీకృష్ణుని సూచన మేరకు దేవతా వృక్షంగా చెప్పబడే జమ్మి(శమీ)చెట్టు మీద భద్రపరుస్తారు. అవి ఇతరులకు కనిపించకుండా ఉంటాయి. ఏడాది పాటు అజ్ఞాత వాసాన్ని ముగించుకున్న తర్వాత చివరిలో జరిగిన ఉత్తర గోగ్రహణం సమయంలో ఆయుధం అవసరమైన అర్జునుడు శమీవృక్షాన్ని సకలోపచారాలతో పూజించి తాము భద్రపరచిన ఆయుధాలను తీసి ఉత్తర కుమారుడి పక్షాన కౌరవులతో యుద్దం చేసి విరాట రాజుకు విజయాన్ని చేకూరుస్తాడు. ఆ విధంగా అర్జునుడు శమీ వృక్షాన్ని పూజించింది పవిత్రమైన విజయదశమి పర్వదినమే.
శమీపూజ చేసిన రాముడు..
రామాయణ కాలంలో శ్రీరాముడు తల్లి కోరిక మేరకు అరణ్యవాసం వెళ్లగా, రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతాపహరణ కావించగా వానర సేనల సహకారంతో సీతను రావణుడు చెరబట్టిన విషయాన్ని తెలుసుకున్న రాముడు చివరకు రావణునితో యుద్ధానికి వెళ్లే ముందు శమీపూజ చేసినట్టు కొందరు చెబుతారు. అనంతరం జరిగిన రామరావణ యుద్ధంలో రాముడు విజయం సాధిస్తాడు. ఇంతటి విశిష్టత, పవిత్రత ఉండటం చేతనే నాటి పురాణ కాలం నుంచి నేటి వరకు ఏటా విజయదశమినాడు చెడుపై మంచి సాధించిన విజయానికి గురుతుగా శమీపూజను ఆచరించటం ఆనవాయితీ. ఆనాటి అదే సంప్రదాయాన్ని పురాతన ఆలయాలైన సింహాచలం, భద్రాచలం వంటి పలు క్షేత్రాలలో శమీపూజ నేటికీ కొనసాగుతోంది. నేడు సింహాచల కొండదిగువ స్వామివారి పూదోటలో శమీపూజా మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజాలంకారంలో మెట్లమార్గంలో పల్లకిలో కొండదిగువకు తీసుకువస్తారు.
శమీవృక్షానికి ఆధ్యాత్మిక విశిష్టత మాత్రమే కాకుండా పలు ఔషధ గుణాలు కూడా ఉన్నట్టు చెబుతారు. వాటిలో ప్రధానంగా ముఖంపై కలిగే అవాంఛిత రోమాలను తొలగించటానికి, కొన్ని రకాల చర్మవ్యాధులను సంరక్షించేందుకు శమీచెట్టు బెరడు ఉపయోగపడుతుందట.
🌹🌹🌹🙏🙏🙏